సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్
మండెపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు.. సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ పరిశీలన
త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడి
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్, జూన్ 21: రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన ఆయన, 11:50 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మంత్రికి కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంపీపీ మానస, జడ్పీటీసీ మంజుల పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సిరిసిల్ల పట్టణ వాసుల కోసం నిర్మించిన 1320 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం(కేసీఆర్ నగర్), పైలాన్ను పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. ఇండ్లల్లో మౌలిక సదుపాయాలతోపాటు చిల్డ్రన్ పార్క్, గ్రీనరీ, గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ పండుగలను జరుపుకొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదట అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ తరహా పార్క్ ఉండాలని సూచించారు. మిగిలిన స్థలంలో అవసరమైతే మరిన్ని ఇండ్లను నిర్మించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 12:30 గంటలకు డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వరకు వంద ఫీట్ల రోడ్డు పనులను పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. మ్యాప్ను పరిశీలించి పలు సూచనలిచ్చారు. అక్కడి నుంచి 1:10 గంటలకు సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. 1:30 గంటలకు క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడే భోజనం చేసి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 3:05 గంటలకు సమీకృత కలెక్టరేట్ను సందర్శించారు.
త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం..
ఈ సందర్భంగా సమీక్షలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మండెపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం, సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల, నూతన సమీకృత కలెక్టరేట్, సర్దాపూర్లోని మార్కెట్ యార్డ్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, అదేరోజు సిరిసిల్లలోని పద్మశాలి భవన్కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్లకు చేరుకునేందుకు వీలుగా వేస్తున్న వంద ఫీట్ల రోడ్డు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్, మార్కెట్ యార్డ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రహదారులన్నీ హరితశోభను సంతరించుకోవాలని, పారిశుధ్య పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సేవలను కొనియాడారు. ఆయాచోట్ల మంత్రి వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కలెక్టర్ కృష్ణభాస్కర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్వకుంట్ల గోపాల్రావు, ఎంపీపీలు మానస, జనగామ శరత్రావు, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.