రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్కు నోటిఫికేషన్
ఈ నెల 30వ తేదీ వరకు గడువు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 21: మానేరు రివర్ఫ్రంట్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 314 కోట్లు విడుదల చేయగా, మంత్రి గంగుల కమలాకర్ వారం కిందట అమెరికాకు చెందిన ఐకామ్ సంస్థ ప్రతినిధులతో కలిసి నది పరిసరాలను పరిశీలించి, 15 రోజుల్లోగా సర్వేచేసి నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి అర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల కోసం రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్కు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల చివరి వరకు గడువు విధించింది.
కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. తొలిదశలో ఎల్ఎండీ నుంచి దిగువన 15 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా సుందరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు రివర్ ఫ్రంట్లో భాగంగా ఇప్పటికే చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మానేరు నదిలో నీరు నిలువ చేసేందుకు వీలుగా చేపట్టిన ఐదు చెక్డ్యాంల పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. రివర్ ఫ్రంట్లో భాగంగా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 314 కోట్లను విడుదల చేసింది. నిధులు విడుదలైన మరుసటి రోజే మానేరు రివర్ ఫ్రంట్పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టును అత్యుత్తమ ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. మంత్రి గంగుల సైతం ఈ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆమెరికా కంపెనీ ప్రతినిధులతో చర్చించారు.
కేసీఆర్కు కరీంనగర్పై ప్రత్యేక ప్రేమ
మానేరు రివర్ ఫ్రంట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం.. అధునాతన థీమ్ పార్కులు నిర్మిస్తాం. పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. ఇక్కడికి వచ్చేవారు నాలుగు, ఐదు రోజులు ఇక్కడే ఉండే విధంగా ప్రాజెక్టుల్లో సౌకర్యాలు, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ మొదటి నుంచి కరీంనగర్పై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు. నిధులిచ్చిన సర్కారుకు కరీంనగర్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడమే గాకుండా కరీంనగర్కు దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభిస్తుంది.