సీజనల్ వ్యాధులను నివారించాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్
పందిళ్లపల్లి, జగన్నాథపురంలో ఆకస్మిక పర్యటన
చింతకాని, జూన్ 21: పల్లెల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనుల్లో అలసత్వాన్ని సహించనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పల్లెప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చింతకాని మండలం పందిళ్లపల్లి, జగన్నాథపురం గ్రామాల్లో సోమవారం ఉదయం పల్లెప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పందిళ్లపల్లిలో రోడ్లవెంట కలియతిరుగుతూ డ్రైనేజీల్లో చెత్తను చూసి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెపకృతివనం, వాటర్ ట్యాంక్, నర్సరీ, డంపింగ్యార్డు, వైకుంఠధామాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం జగన్నాథపురంలో రోడ్ల వెంట చెత్తను పరిశీలించి తీవ్ర అసహనానికి గురయ్యారు. పల్లెల్లో పారిశుధ్యం ఇలానే కొనసాగితే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధుల్లో అలసత్వం తొలగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీఏవో విజయనిర్మల, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీఓ రవికుమార్, ఎంపీవో రవీంద్రప్రసాద్, సర్పంచులు ఇనుకుళ్ల పుల్లారెడ్డి, ఆలస్యం నాగయ్య, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఏవో పల్లెల నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎస్ఐ రెడ్డబోయిన ఉమ, కార్యదర్శులు నిఖిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
షోకాజ్ నోటీసులివ్వండి..
పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆయా గ్రామాలకు చెందిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు షోకాజ్ నోటీసులివ్వాలని మంత్రి పువ్వాడ అజయ్.. జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.