భద్రాచలం, అక్టోబర్ 20 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించే శబరి స్మృతియాత్రను ఈ ఏడాది కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది గిరిజన భక్తులతోనే నిరాడంబరంగా జరిపారు. భక్త శబరి వారసుల రాకతో ఆలయ ప్రాంగణం పులకించింది. దేవస్థానం ఈఓ, ఆలయ అర్చకులు, అధికారులు శబరి విగ్రహం వద్ద పూజలు చేశారు. దేవస్థానం వైదిక సిబ్బంది, అర్చకులు వేద పండితులు ముందుగా విశ్వక్సేన ఆరాధన నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం తూము నర్సింహాదాసు, భక్త రామదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మేళతాళాలు, అర్చకుల వేదమంత్రాల నడుమ శబరి నది నుంచి తీసుకువచ్చిన జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకం జరిపారు. దేవస్థానం సిబ్బంది పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి, బలిపీఠం వద్ద పూజలు చేశారు. శబరి చిత్రపటంతో, శబరి వంశీయుల కొమ్ము డ్యాన్సులు, రేలా నృత్యాలతో ఆలయ ప్రదక్షిణ, నగర ప్రదక్షిణతో వీధులన్నీ పరవశించాయి. అదేవిధంగా వాల్మీకి జయంతిని పురస్కరించుకొని చిత్రకూట మండపం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద అర్చకులు పూజలు చేశారు.
నేత్రపర్వంగా పుష్పార్చన
త్రేతాయుగంలో రాముడి దర్శనం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన భక్త శబరి, ఆయన రాకతో తనువంతా పులకించగా, రామయ్య కోసం దాచిన ఫలాలను భక్తితో సమర్పించింది. ఆ పళ్లు తీయగా ఉన్నాయో లేవోనని, తాను ముందుగా తిని, బాగున్న వాటిని రామయ్య తండ్రికి తినమని ఇచ్చింది. శబరి పరమ భక్తురాలు అవడంతో శ్రీరామచంద్రమూర్తి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్లను ఆరగించాడు. అటువంటి భక్త శబరిని స్మరిస్తూ కొన్నేళ్లుగా గిరిజనుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో ‘శబరి స్మృతి యాత్ర’, ‘దమ్మక్క స్మృతియాత్ర’ను ఎంతో వైభవంగా జరుపుతున్నారు. అడవి నుంచి గిరిజనులు సేకరించి తీసుకువచ్చిన వివిధ రకాల పండ్లు, పూలతో రామయ్య తండ్రికి పుష్పార్చన, ఫలార్చన నిర్వహించారు. అంతకుముందు అర్చకులు, వేద పండితులు శ్రీరామనామ జపం చేస్తూ ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు.
ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు
భక్త శబరి చిత్రపటంతో గిరిజనులు భద్రాచలం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్, బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడ నుంచి రామాలయం వరకు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు పట్టణ వాసులను అలరించాయి. శబరి స్మృతియాత్రలో పాల్గొన్న గిరిజనులను దేవస్థానం ఈఓ వస్ర్తాలను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, ఏఈఓ శ్రావణ్కుమార్, డీఈ రవీందర్రాజు, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకుడు అమరవాది విజయరాఘవన్, వైదిక సిబ్బంది, అర్చక సిబ్బంది, గిరిజన సంఘ నేతలు ముర్ల రమేశ్ పాల్గొన్నారు.