అత్యవసరమైతేనే బయటకు రండి
స్వీయ నియంత్రణ పాటించండి
ప్రజలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు విజ్ఞప్తి
మెట్పల్లి, మే 20 : ‘కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలి.. అనవసరంగా రావద్దు.. చేతులెత్తి మొక్కతున్నా’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు. కొంత అనారోగ్యం వల్ల నియోజకవర్గానికి రాలేకపోతున్నానని, తన కొడుకు డాక్టర్ సంజయ్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. సొంత ఖర్చులతో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లను మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేశారని గుర్తుచేశారు. ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
కరోనా బారిన పడిన వారెవరూ కూడా మనోధైర్యం కోల్పోవద్దని, సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కరోనా వైద్యచికిత్స, ఆక్సిజన్లు, ఇతరత్రా మందులకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. అదే విధంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిందని, పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోరుట్లలో వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడంతోపాటు అందుకు సంబంధించి జీవో కూడా విడుదల చేసిందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.