సప్తగిరి కాలనీలో 50 బెడ్లతో ఐసొలేషన్ కేంద్రం
కొవిడ్ బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సేవలు
గోదావరిఖని, మే 20: కరోనా బాధితులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేను న్నానంటూ ముందడుగేసి అండగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గంలోఎక్కడైనా, ఎవరి కైనా కరోనా సోకిందనే విషయం తెలియడమే ఆలస్యం.. నేరుగా వెళ్లి వారికి మందులు, వైద్యం అందించడంతోపాటు వారిలో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే గోదావరిఖని సప్తగిరి కాలనీలోని సాంఘిక వసతి గృహంలో ప్రభుత్వం సుమారు 50 బెడ్లతో కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కరోనా ప్రబలి ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉన్న వారిని తరలించి వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నది.
బాధితులకు ‘భరోసా’..
కరోనా కట్టడి చర్యలతో పాటు కొవిడ్ బాధితులకు ఎమ్మెల్యే భరోసాగా నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో భరోసా యాత్ర ద్వారా రోజుకో డివిజన్లో పర్యటిస్తూ అక్కడ కరోనా బాధితుల వివరాలను సేకరించడమే గాకుండా నేరుగా వారి ఇండ్లకు వెళ్లి వారికి మందులు, పోషకాహారం అందజేస్తున్నారు. వారు కోలుకునేందుకు ప్రత్యేక వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనాతో గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలోని కొవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వద్దకు చందర్ పీపీఈ కిట్లు ధరించి నేరుగా వెళ్లి ఆప్యాయంగా పలుకరించడమే గాకుండా వారు కోలుకునేలా మెరుగైన వైద్య చికిత్స కోసం కృషి చేస్తున్నారు. అలాగే స్థానిక సింగరేణి ఏరియా దవాఖానలోని ఐసొలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న కార్మికులను కూడా కలుసుకొని వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.
అల్పాహారం, భోజనం..
సప్తగిరి కాలనీలోని ఐసొలేషన్ కేంద్రంలో బాధితులకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా రోజు మూడు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ ల్లో నాణ్యమైన భోజనాన్ని క్రమం తప్పకుండా అందజేస్తూ పేషెంట్లలో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే క్యాంపు కార్యాలయంలో కొవిడ్ పేషెంట్ల కోసం హెల్ప్ డెస్క్ (నం.18005 998666)ను కూడా ఏర్పాటు చేశారు.