ఫీవర్ లక్షణాలున్న వారి ఇంటికే మెడికల్ కిట్లు
ఇంట్లో ఉండే కోలుకుంటున్న బాధితులు
జ్వర సర్వే సత్ఫలితాలిస్తుందంటున్న అధికారులు
కొత్తగూడెం మే 20:కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వే సత్ఫాలితాలు ఇస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసి వైరస్పై అవగాహన కల్పిస్తున్నాయి.. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వారికి మెడికల్ కిట్ అందించి వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, మహిళా సంఘాల సభ్యులు, కార్యదర్శలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన మందులను ఇస్తుండడంతో భద్రాద్రి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే పలు పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు కొవిడ్ కట్టడిలోనూ దిక్సూచిగా నిలుస్తోంది. -కొత్తగూడెం మే 20
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే సత్ఫలితాలనిస్తున్నది. ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి మందులు అందజేయడంతో బాధితులు రికవరీ అవుతున్నారు. ఇంట్లో ఉండి వైద్యారోగ్యశాఖ సూచనలు పాటిస్తూ ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, మహిళా సంఘాల సభ్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడం, అవసరమైన మందులను ఇస్తుండడంతో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఇటీవల తెలంగాణలో నిర్వహించిన జ్వర సర్వేను కొనియాడారంటే సర్వే ద్వారా ప్రజలకు ఎంత మంచి ఫలితాలు ఇచ్చాయో ఆలోచించవచ్చు.
కిట్లతో ఉపయోగం..
ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ కిట్లు సిద్ధం చేయిస్తున్నది. అవే మందులు బయట కొనాల్సి వస్తే రూ.వెయ్యి వరకు ఖర్చవుతాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ప్రజలకు మెడికల్ కిట్లు అందజేస్తున్నది. ప్రత్యేక బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే మెడికల్ కిట్లు అందజేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. సర్కారు మందులతో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజలకు తొమ్మిది రకాల మందులు అందుతున్నాయి. ప్రత్యేక బృందాలు వారికి ఆహార నియమాలు వివరించాయి. దీంతో జ్వర లక్షణాలు ఉన్నవారికి ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చింది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బృందాలు 3,02918 ఇండ్లలో సర్వే చేపట్టాయి. 21,202 మందికి మెడికల్ కిట్లు అందించారు. వారంతా ఇంట్లో ఉండే రికవరీ అవుతున్నారు.
సర్వేతో కేసులు తగ్గుముఖం..
ఇంటింటి సర్వేతో బాధితుల రికవరీ రేటు పెరిగింది. గ్రామస్థాయిలో పీహెచ్సీల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఆసుపత్రిలో 50 మంది బాధితులు అడ్మిట్ అయితే 20 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. ఇంటి సర్వేలో మందులు తీసుకున్నాక 50 మంది బాధితులు అడ్మిట్ అయితే 50 మంది డిశ్చార్జ్ అవుతున్నారు. ముఖ్యంగా పీహెచ్సీల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. జిల్లాలో ఇల్లెందు, సులానగర్, అశ్వారావుపేట, అశ్వాపురం పీహెచ్సీల్లో కొన్ని కేసులు ఉన్నప్పటికీ ఇతర పీహెచ్సీల్లో పాజిటివ్ కేసులు చాలావరకు తగ్గిపోయాయి. భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,493 ఉండగా, వీరిలో హోం ఐసోలేషన్లో 4,261 మంది చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో 94 మంది, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో 138 మంది చికిత్స పొందుతున్నారు.
మందుల కిట్తో ఆరోగ్య సంరక్షణ..
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే సత్ఫలితాలనిస్తున్నది. ప్రత్యేక బృందం వారు ఎక్కడికక్కడ మందులు పంపిణీ చేయడంతో జ్వరం ఉన్నవారు ఇంట్లో ఉండే మందులు వాడి దాని నుంచి బయటపడుతున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మందుల కిట్ వాడితే సరిపోతుంది. అనవసర భయాలు పెట్టుకోవద్దు. కరోనా చైన్ సిస్టం కట్ కావాలంటే ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు పాటించాలి.