కోరుట్ల, మెట్పల్లిలో వరుస దొంగతనాలు
నిందితుడి అరెస్ట్
రూ. 5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
కోరుట్ల, మే 19: పొద్దంతా గ్యాస్ స్టౌ రిపేర్లంటూ ఊరంతా తిరుగుతాడు. చీకటైందంటే చాలు ఇళ్లకు కన్నా లు వేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మళ్లీ తెల్లారితే ఏమీ ఎరుగనట్లు తన పని చేసుకెళ్తాడు. ఇలా వరుస దొంగతనాలు చేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి పోలీసులు రూ. 5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపించారు. స్థానిక సీఐ రాజశేఖర్రాజు నిందితుడి వివరాలు వెల్లడించారు. కొద్ది రోజులుగా కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కోరుట్ల పట్టణ శివారు కావేరి గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలిక టెంట్లు వేసుకొని కొంతమంది జీవనం గడుపుతున్నారు. బుధవారం పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్కు చెందిన సిరిగిరి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇతను 10 ఏళ్లుగా నల్లగొండ, జనగాం, వరంగల్, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి జైలు జీవితం అనుభవించినట్లు విచారణలో తేలింది. నిందితుడు 2020 సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో కోరుట్లకు మకాం మార్చాడు. సాయిబాబా ఆలయ సమీపంలో కావేరి గార్డెన్ వద్ద గుడిసె వేసుకొని గ్యాస్ స్టౌ రిపేర్, నవారు మంచం అల్లుతామంటూ పట్టణంలో తిరుగుతున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇప్పటి దాకా కోరుట్లలో రెండు చోరీలతో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాలో పలు నేరాలు చేశాడని, దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేసేవాడని సీఐ చెప్పారు. అతడి నుంచి రూ. 5 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు సతీశ్, రాజప్రమీల, ట్రైనీ ఎస్ఐ సురేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.