అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్
కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
శక్కర్నగర్, మే 19: లాక్డౌన్ నిబం ధనల సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని బోధన్ ఏసీపీ రామారావు హెచ్చరించారు. లాక్డౌన్ సందర్భంగా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం ఏసీపీ రామారావు పర్యవేక్షణలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు అనవసరంగా చిన్నచిన్న కారణాలతో బయటికి వస్తున్నారని, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని ఆయన సూచించారు. ఉదయం 10 గంటల అనంతరం వాహనాల తనిఖీలు చేపడుతామని, ఒకవేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రమణ్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
భీమ్గల్లో..
భీమ్గల్, మే 19: కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఈనెల 30 వరకు లాక్డౌన్ను పొడిగించిందని ఏసీపీ రఘు తెలిపారు. భీమ్గల్ మండలంలో కొనసాగుతున్న లాక్డౌన్ను బుధవారం ఆయన పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని దుకాణాల యజమానులతో మాట్లాడారు. సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. ఏసీపీ వెంట సీఐ శ్రీనాథ్రెడ్డి, ఎస్సై శ్రీధర్రెడ్డి, ట్రైనీ ఎస్సైలు ఉన్నారు.
రెంజల్లో..
రెంజల్, మే 19 : మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొన సాగింది. మండలంలోని ప్రజలు ఉదయం 6 నుంచి 10 గంటలలోగా నిత్యావసర సరుకులు, కూరగాయలను కొనుగోలు చేశారు. 10 గంటల తర్వాత ఇంటి నుంచి ప్రజలు బయటికి రావడం లేదు. అనవసరంగా బయట తిరిగిన వారిని గుర్తించి పోలీసులు జరిమానా విధించారు. కందకుర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద వచ్చిపోయే వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి, మే 19 : మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకే అన్ని రకాల వ్యాపార సముదాయాలు, దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. 10 గంటల తర్వాత లాక్డౌన్ పాటిస్తుండడంతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. పోలీసు సిబ్బంది లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగేలా పర్యవేక్షిస్తున్నారు.