ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి
రాంనగర్ వద్ద వాహనాలు తనిఖీ
ఎదులాపురం, మే 19: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిందన్నారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ వద్ద మావల ఎస్ఐ హరిబాబుతో కలిసి బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. 10 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటూ జరిమానా విధించారు. అత్యవసర సేవ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారికి అనుమతి ఇచ్చారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
దుకాణాల నిర్వాహకులకు జరిమానా
బోథ్, మే 19: మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపించిన దుకాణాల నిర్వాహకులకు బోథ్ సీఐ ముదావత్ నైలు జరిమానా విధించారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు, సామగ్రి అమ్ముకునేందుకు ప్రభుత్వం సడలింపు ఇచ్చిందన్నారు. నిబంధనలను వ్యాపారులు పాటించాలని సూచించారు. అనుమతి లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఎస్ఐ రాజు గ్రామాల్లో తిరిగి లాక్డౌన్ తీరును పర్యవేక్షించారు.
పోలీసులకు సహకరించాలి
నార్నూర్, మే 19: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ రమేశ్ కోరారు. మండల కేంద్రంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు. బయట తిరిగే వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. అవసరం లేకున్నా బయటకు వస్తూ కరోనా వ్యాప్తికి కారకులు కావొద్దని సూచించారు. ఉదయం 10 గంటలలోపు పనులు చేసుకొని ఇళ్లకు వెళ్లాలని వివరించారు. మార్కెట్లో మాస్కు ధరించని వారికి పోలీసులు జరిమానా విధించారు.
ఉట్నూర్, మే 19: పట్టణంలో ఎస్ఐ సుబ్బారావు వాహనాలు తనిఖీ చేశారు. అనవసరంగా బయట తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఆయన వెంట ట్రైనీ ఎస్ఐ రాజమణి, సిబ్బంది ఉన్నారు.
ప్రశాంతంగా లాక్డౌన్
సిరికొండ, మే 19: ప్రభుత్వ విధించిన లాక్డౌన్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 10 గంటల వరకు ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు, వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వచ్చి ఆ తర్వాత ఇండ్లకు పరిమితమవుతున్నారు. ఎస్ఐ కృష్ణ కుమార్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.