మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న
జడ్పీ కార్యాలయంలో భగీరథుడి జయంతి
ఎదులాపురం,మే19 : భగీరథుడి స్పూర్తితో ఇంటింటికీ శుద్ధ జలం అందించే బృహత్ కార్యక్రమనికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయ ఆవరణలో బుధవారం భగీరథ జయంతి నిర్వహించారు. మంత్రి అల్లోల, ఎమ్మెల్యే జోగు రామన్న భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దివి నుండి భువికి గంగాదేవిని తీసుకు రావడానికి భగీరథుడు యజ్ఞం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే సంకల్పంతోనే మిషన్ భగీరథ వంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నీటి సమస్యలు దూరం చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటి పెల్లి రాజు, రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, అనిల్జాదవ్, ఎంపీపీలు, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్, నల్లరాజేశ్వర్ పాల్గొన్నారు.