సూర్యాపేట, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ అనేక విజయాలు సొంతం చేసుకున్నది. ఎన్నో
ఆటుపోట్లను ఎదుర్కొని తిరుగులేని శక్తిగా మారింది. స్వరాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నది. వచ్చే నెల 15న పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయ గర్జన సభకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నియోజకవర్గ ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాయత్త సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి నేతలతో మాట్లాడారు. మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఎంపీ బడుగుల, జడ్పీ చైర్పర్సన్ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డితోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొనగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలతో మాత్రమే కాకుం డా, రాజకీయ ఎజెండాతో సాధ్యమవుతుందని భావించిన నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థా పించిన విషయం తెలిసిందే. కేవలం నలుగురితో ప్రారంభమైన పార్టీ అనతికాలంలోనే అనేక ఆటుపోట్లు, పరాభవాలు, అవమానాలను ఎదుర్కొని రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యంగా 2014లో రాష్ర్టా న్ని సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని అదే ఉద్య మ రీతిన అభివృద్ధి చేసుకోవాలనే తలంపుతో ఎన్నికల బరిలో నిలిచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి అధికారం చేపట్టింది. రాష్ట్రం లో టీఆర్ఎస్కు పోటీనిచ్చే పార్టీ మరొకటి లేదని ఆ పార్టీ నాయకులు సగర్వంగా చెబుతున్నారు.
సగర్వంగా ప్రజల ముందుకు..
టీఆర్ఎస్లో ఉన్న వారంతా గర్వంగా ప్రజల ముందుకు పోయే స్థాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కల్పించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నందున పది లక్షల మందితో కాదు.. ఎన్ని లక్షల మందితోనైనా సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు లబ్ధి కలుగలేదని సాధారణ ప్రజలే కాదు, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా చెప్పలేరంటున్నారు. ఇన్నేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో రాజకీయం చేయగలిగే పార్టీ టీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీ లేదనేది స్పష్టమవుతుందని కేటీఆర్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు చెబుతున్నారు.
గ్రామ, మండల స్థాయి సమావేశాలు
హైదరాబాద్లో నియోజకవర్గాల స్థాయి సమావేశాలు జరిగినందున త్వరలోనే అన్ని గ్రామాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 15న జరిగే టీఆర్ఎస్ విజయగర్జన సభకు సమాయత్తం కానున్నారు. భారీగా హాజరయ్యేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ ఏర్పాట్లను బట్టి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తామంటున్నారు. తరలిన వారిలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర ప్రతినిధులు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఉన్నారు.
టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల హాజరు
హుజూర్నగర్, అక్టోబర్ 18 : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితోపాటు పలువురు ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ, పురపాలికశాఖల మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీకి ప్రజాప్రతినిధులంతా హాజరుకావాలని కోరినట్లు పేర్కొన్నారు.