సూర్యాపేట సిటీ, అక్టోబర్ 18 : పోలీస్ గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా దివస్ (పోలీస్ గ్రీవెన్స్ డే)ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం 11 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదన్నారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
ఈ నెల 21 పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని నిర్వహించే పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమాల్లో విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. రక్తదాన శిబిరాలు, శాంతి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఔత్సాహికులకు ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై వ్యాసాలు రాసి https://forms.gle/HvF8Y AgewvyD3wjA9 లింక్ ద్వారా పంపాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవలు వంటి అంశాలపై ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 2020 నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య తీసిన ఫొటోలను, 2 నిమిషాల షార్ట్ ఫిలిమ్స్ను https://for ms.gle/uJj58xXN1GQ PNjp8A లింక్ ద్వారా పూర్తి వివరాలతో పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948642367 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.