ములుగు జిల్లా వ్యాప్తంగా 1,79,818 మందికి కొవిడ్ టీకాలు
ఆరు గ్రామాల్లో 100 శాతం పూర్తి
మరో వారంలో అందరికీ వేసేలా ప్రణాళిక
ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది
33 కేంద్రాల ద్వారా సేవలు
మెగా వ్యాక్సినేషన్తో సత్ఫలితాలు
ములుగు, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 20 నెలలుగా కృషి చేస్తూ వైద్యసేవలందిస్తున్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను గత నెల 16 నుంచి ప్రారంభించి కరోనా టీకాలు ముమ్మరంగా ఇస్తున్నారు. అర్హులందరూ టీకా తీసుకునేలా పటిష్టమైన ప్రణాళికలతో పీహెచ్సీల వారీగా వైద్య ఆరోగ్యశాఖ టీంలను ఏర్పాటు చేసింది. మారుమూల పల్లెలు, గొత్తికోయ గూడేలకు స్వయంగా వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. టీకా పంపిణీలో భాగంగా జిల్లాలో 33 కేంద్రాల్లో వైద్య బృందాలతో 18 ఏళ్లు నిండిన వారందరూ టీకాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జీపీ కార్యాలయాలు, వైద్య విధాన పరిషత్, దవాఖానల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు మెప్మా, డీఆర్డీఏ, డీఆర్డీవో, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందితో కూడిన బృందాలు ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అర్హులై ఉండి టీకా తీసుకోని వారు ఉంటే వారిని టీకా కేంద్రాలకు తీసుకెళ్లి టీకాలను ఇప్పిస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 90 శాతం పూర్తి కాగా ఆరు గ్రామాల్లో 100 శాతం పూర్తయినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు.
1,79,818 మందికి టీకాలు
జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభ దశలో టీకాలు వేయడం మందకొడిగా జరిగినా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తీసుకుంటున్న చర్యలతో వ్యాక్సినేషన్ వేగంగా పుంజుకుంది. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు డీఎంహెచ్వో ఇతర వైద్యాధికారులతో కలిసి స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో టీకా తీసుకునేందుకు వెనుకాడిన వారు సైతం ముందుకు వస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 174 గ్రామ పంచాయతీలోని ఆరు గ్రామాల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. మొత్తం 2,20,332 మంది అర్హులు ఉండగా ఇప్పటి వరకు 1,79,818 మంది టీకాలను తీసుకున్నారు. ఇందులో సెకండ్ డోస్ 56,461 మంది తీసుకున్నారు. 33 టీకా కేంద్రాల ద్వారా నిర్దేశించిన రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ బృందాలతో టీకాలు అందిస్తున్నారు. రాయినిగూడెం పీహెచ్సీ పరిధిలో అత్యధికంగా 23,325 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.