రైతునురాజు చేస్తున్న సీఎం కేసీఆర్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
హన్మంతాపూర్లో సబ్స్టేషన్, వైకుంఠధామం ప్రారంభం
నర్మెట, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమినిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హన్మంతాపూర్లో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను, వైకుంఠధామాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు. సమైక్య పాలనలో రైతు సంక్షేమాన్ని విస్మరించారన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్ను 24 గంటలు అందిస్తున్నదన్నారు. రైతు బంధు, రైతుబీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతున్నాయని అన్నారు. గతంలో కరంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. పగలు, రాత్రి వేళలో రైతులు వ్యవసాయ బావుల వద్దనే ఉంటూ అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. నేడు 24 గంటల వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా జరగడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని ముత్తిరెడ్డి వివరించారు. జనగామ నియోజకవర్గంలో 12 సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందన్నారు. మరో 6 సబ్స్టేషన్లకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. హన్మంతాపూర్ సబ్స్టేషన్ పరిధిలో బొమ్మకూరు, హన్మంతాపూర్, మల్కపేట ఫీడర్లలో 104 ట్రాన్స్ఫార్మర్లు, 1078 మోటర్లకు విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో అనవసర రాద్ధాంతం చేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, సర్పంచ్లు పగడాల విజయ నర్సయ్య, బానోత్ రజితారవి, బానోత్ శంకర్నాయక్, ఆమెడపు కమలాకర్రెడ్డి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎస్ఈ మల్లికార్జున్, డీఈ సదానందం, ఏడీఈ మనోహర్రెడ్డి, ఏఈ అశోక్, సబ్ ఇంజినీర్ మణిదీప్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, వివిధ గ్రామశాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.