రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణనీయంగా పంటలు
ఈసారి వానకాలం సాగు అంచనా 2,81,098 ఎకరాలు
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
పెట్టుబడికి అందిన సర్కారు సాయం సన్నద్ధమవుతున్న కర్షకులు
రాజన్న సిరిసిల్ల, జూన్ 18, (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు సాగు నీరు లేక.. సరైన పంటలు పండక దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం.. ఇప్పుడు పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో కళకళలాడుతోంది. రెండేళ్లుగా కాళేశ్వర జలాలు అందుతుండడం.. భూగర్భ జలాలు ఆరు మీటర్ల పైకి ఉబికి వస్తుండడంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. గత సంవత్సరం 2,58,965 ఎకరాల్లో వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక రూపొందించగా, ఈ ఏడాది 2,81,098 ఎకరాలకు అంచనా వేసింది. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయగా, రైతాంగం దుక్కులు దున్ని సాగుకు సన్నద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతం.. 625 చెరువులున్నా చుక్కనీరుండని దైన్యం. ఈప్రాంత రైతాంగం వ్యవసాయ పనులు లేక బతుకు దెరువు కోసం వలస బాట పట్టింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడి రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానన్న మున్సిపల్ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చడంతో జిల్లా జలకళ సంతరించుకుంది. గోదావరి జలాలు చెరువులన్నింటినీ నింపుతుండడంతో భూగర్భ జలాలు ఆరు మీటర్ల పైకి ఉబికి వస్తున్నాయి. ఫలితంగా పసిడి పంటలు పండుతున్నాయి. ఒకప్పుడు వలసపోయిన రైతులు ప్రస్తుత పరిస్థితులను చూసి తిరిగి స్వగ్రామాలకు చేరి సాగుబాట పడుతున్నారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం అంచనా ఏటికేడు పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం 2,58,965 ఎకరాలలో సాగు ప్రణాళిక కాగా, ఈ ఏడాది 2,81,098 ఎకరాలకు అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో ఒక వరి సాగే గత సంవత్సరం 91,566 ఎకరాలు కాగా, ఈ ఏడాది 1,13,300లకు అంచనా వేశారు. 1,30,000 వేల ఎకరాల్లో పత్తి, 61 ఎకరాల్లో జొన్న, 35 వేల ఎకరాల్లో కంది, 1,276 ఎకరాల్లో అనుములు, 1,276 ఎకరాల్లో పెసర, 32 ఎకరాల్లో ఉలువలు, 18 ఎకరాల్లో పల్లి, 316 ఎకరాల్లో ఆముదం, 10 ఎకరాల్లో సోయాబిన్, 56 ఎకరాల్లో చెరుకు,255 ఎకరాల్లో ఇతర పంటల సాగు కోసం అంచనా రూపొందించారు.
అందుబాటులో విత్తనాలు
వానకాలం సాగు అంచనాతోపాటు విత్తనాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. బీపీటీ 5204 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్ 6000 క్వింటాళ్లు, తెలంగాణ సోన 8500 క్వింటాళ్లు, ఇతర దొడ్డు రకాలు 16,000 క్వింటాళ్లు, కంది 400 క్వింటాళ్లు, 3 లక్షల పత్తి ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
వానకాలం పంటకు అంతా సిద్ధం
వానకాలం పంటల సాగుకు ప్రణాళిక అంతా సిద్ధం చేశాం. యాసంగిలో అంచనాలను మించి సాగైంది. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వానకాలంలో సాగు అంచనా ప్రణాళికలు గతంలో కన్నా ఎక్కువే చేశాం. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు అన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. అన్ని మండలాల్లో స్టాకు ఉంచాం
రైతులకు ఇబ్బంది లేదు
ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కితే కానీ దొరకని పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతున్నది. దుక్కులు దున్నక ముందే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. యాసంగిలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చినందున రైతులంతా సంతోషపడుతున్నరు. కొత్త పంటలపై దృష్టి సారించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.