కాళేశ్వరం లింక్-1, 2లో కొనసాగుతున్న ఎత్తిపోతలు
అన్ని పంప్హౌస్లలో నడుస్తున్న 17 మోటర్లు
ఎస్సారార్ నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల
పెద్దపల్లి, జూన్ 18(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ రామడుగు/ బోయినపల్లి/ తిమ్మాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతుండడంతో పంపుల నిండుగా ఎదురెక్కుతూ గోదావరి పొంగిపొర్లుతున్నది. వందల మీటర్ల పైకెక్కుతూ పసిడి పంటలు పండించేందుకు తరలివస్తున్నది. అన్నిపంప్హౌస్లలో మొత్తం 17 మోటర్లు నడుస్తుండడంతో జలాశయాల్లోకి ఉప్పొంగుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. లింక్-1 పరిధిలోని లక్ష్మీ బ్యారేజీలోకి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో 8,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 15 గేట్లను ఎత్తి 3,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. లక్ష్మీ పంపుహౌస్లోని ఆరు పంపులను (1,2,4, 5, 7, 8)ను ఆన్ చేసి 12,600 క్యూసెక్ల నీటిని సరస్వతీ బ్యారేజీలోకి ఎత్తి పోస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 10.884 టీఎంసీల నీరు నిలువ ఉంది. సరస్వతీ బ్యారేజీలోకి లక్ష్మీ బ్యారేజీ నుంచి వస్తున్న 12,600ల క్యూసెక్కుల నీటితో పాటు మానేరు, ఇతర నీటి వనరుల నుంచి 1400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఇందులో 10.87 టీఎంసీల సామర్థ్యానికి 7.10 టీఎంసీల నీరు నిలువ ఉంది.
సరస్వతీ పంపుహౌస్లోని 3 పంపు(7, 8, 12)లను ఆన్ చేసి 8,790 క్యూసెక్కులను పార్వతీ బ్యారేజీలోకి ఎత్తి పోస్తున్నారు. పార్వతీ బ్యారేజీలో 8.83 టీఎంల సామర్థ్యానికి 4.711 టీఎంసీల నీరు నిలువ ఉంది. పార్వతీ పంపుహౌస్లోని రెండు పంపుల(11, 10)ను ఆన్ చేసి 5220 క్యూసెక్కులను ఎల్లంపల్లిలోకి ఎత్తి పోస్తున్నారు. ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీల సామర్థ్యానికి 8.739 టీఎంసీల నీరు నిలువ ఉంది. అక్కడి నుంచి రెండు టన్నెళ్ల ద్వారా లింక్-2లోని ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్హౌస్కు తరలుతుండగా, ఇక్కడ 3 మోటర్ల(3, 4, 6)ను ఆన్ చేసి 9450 క్యూసెక్ల నీటిని నంది రిజర్వాయర్లోకి నీటిని ఎత్తి పోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లో గాయత్రీ పంప్హౌస్కు తరలుతున్నాయి. ఇక్కడ మూడు మోటర్ల (1, 2, 3)ను ఆన్ చేసి 9,450 క్యూసెక్కుల నీటిని శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 0.8 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికారులు తెలిపారు. పంపుల పని తీరును నిరంతరం రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఎల్ఎండీకి నీటి విడుదల
గాయత్రీ పంప్ హౌస్ నుంచి రెండు రోజులుగా కాళేశ్వర జలాలు వస్తుండడంతో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి శుక్రవారం దిగువన ఉన్న ఎల్ఎండీకి నీటిని విడుదల చేశా రు. 5 గేట్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం 10.483 టీఎంసీల నీరుందని, 20 టీఎంసీల సామర్థ్యం వచ్చే వరకు ఎస్సారార్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ఈఎన్సీ శంకర్ తెలిపారు.