ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
నిత్యావసరాలు అందించాలి
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
కాలినడకన వెళ్లి పరిశీలన
జైనూర్, జూన్ 18 : అడ్డెసర వాగు వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాలినడకన అడ్డెసర వాగుకు వెళ్లి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. టెండర్ పూర్తికాగా మే నెలలో పనులు ప్రారంభించారని, ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పనులు నిలిచిపోయినట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు తగ్గిన వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం కిషన్నాయక్తండా, చింతకర్ర, తాడిగూడ వాసులకు తాత్కాలికంగా రాకపోకలకు వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు స్థానికంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అదేవింగా వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సాయన్న, ఎంపీడీవో ప్రభుదయా, పం చాయతీరాజ్ శాఖ ఏఈ ధర్మేందర్, గ్రామస్తులు, ఆయా శాఖల అధికారులున్నారు.
జోడేఘాట్ను ఆదర్శంగా నిలపాలి
కెరమెరి, జూన్18: జిల్లాలోనే జోడేఘాట్ గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. జోడేఘాట్ను శుక్రవారం సందర్శించారు. కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రా మంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంల పనులు, నర్సరీను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భీం స్మృతీచిహ్నం, నిలువెత్తు విగ్రహంతో పాటు ఆదివాసీ స్మారక మ్యూజియం నిర్మించడంతో పర్యాటకులను ఆకట్టుకుంటుందన్నారు. సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకొని విద్య, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. పచ్చని చెట్లతో గ్రామం ఆకర్శించేలా, రహదారికిరువైపులా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మహ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంఆర్ఐలు అనసూయ, వివేక్, వీఆర్వోలు మోహన్రావ్, ఫక్రుదాస్, షేక్ సుబాన్, గ్రామపటేల్ మోహన్రావ్, గ్రామస్తులు ఉన్నారు.