ఖమ్మం, జూన్ 18: జిల్లాలో టీఆర్ఎస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తామని ఆ విభాగ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువజన విభాగం బలోపేతం కోసం కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగాల భర్తీ ఎక్కువగా జరిగిందన్నారు. అందుకే ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో చోట్లా టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో విస్తరింపజేయడంతో ఖమ్మం నగరంలో కూడా ఐటీ హబ్ ఏర్పడి స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయని గుర్తుచేశారు. త్వరలో మండల, పట్టణ విభాగాలకు కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.