అత్యధిక పోషక విలువలతో దీర్ఘకాల రోగులకు మేలు
రైతులకు అధిక లాభాలు
కిలో రూ. 250-300 పలుకుతున్న బీపీటీ-2841 రైస్
ప్రయోగాత్మక సాగులో లింగాపూర్ రైతు సక్సెస్
శంకరపట్నం, మే 18: నల్లని బియ్యాన్నిచ్చే బీపీటీ-2841 రకం బహుళ ప్రయోజనకారిగా మారింది. అధిక పోషక విలువలతో దీర్ఘకాలిక రోగులకు ఎంతో మేలు చేస్తుండగా, సాగు చేసిన రైతులకు అధిక లాభాలు అందిస్తున్నది. మార్కెట్లో కిలో రూ.250-300 ధర పలుకుతుండడమే ఈ బియ్యానికి ఉన్న డిమాండ్కు నిదర్శనంగా నిలుస్తున్నది.
బ్లాక్ రైస్-2841 రకాన్ని గుంటూరు జిల్లా బాపట్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మిగతా రకాలతో పోలిస్తే పైరు కాస్త ఎత్తుగా పెరుగుతుంది. పిలకలు ఎక్కువ వస్తాయి. తెగుళ్లను తట్టుకుంటుంది. మొదలు దృఢంగా ఉంటుంది. ఈదురు గాలులకు పైరు పడిపోయే అవకాశాలు తక్కువ. ఎకరానికి 35-40 సంచుల దిగుబడి వస్తుంది. 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వానకాలం, యాసంగి రెండు సీజన్లలో పంట వేయచ్చు. ఇతర రకాల మాదిరిగానే సాగు చేసుకోవచ్చు. సాధారణ రకాల కంటే రెండు, మూడు రెట్లు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
అధిక లాభాలతో పాటు పోషక విలువలు
మాకు 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాధారణ బీపీటీతో పాటు జేజేలు-384 సాగు చేసినం. కొద్దిగా బీపీటీ-2841 వేసినం. యూ ట్యూబ్లో చూసి బ్లాక్ రైస్ గురించి తెలుసుకున్న. ప్రయోగాత్మక పంటలు పండించే కాసంపల్లికి చెందిన మల్లారెడ్డి దగ్గర 5-6 కిలోలు ఈ నల్ల వరి విత్తనాలు తెచ్చిన. 10 గుంటలల్ల వేసిన. 10 బస్తాల దిగుబడి వచ్చింది. కంపోస్ట్ ఎరువులు చల్లినం. దిగుబడి ఎట్ల ఉంటదో అని ఒకసారి యూరియా చల్లిన. రసాయన మందులు ఏమీ వాడలేదు. పురుగు మందులు ఏమీ కొట్టలేదు. మామూలుగానే నీటి తడులు అందించిన. దిగుబడి పరవాలేదు. ఇది ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రకం. రైతులు అమ్మడం కోసం కాకున్నా తమకోసమైనా పండించుకోవాలి. కావాల్సిన వారికి విత్తనాలు ఇస్త.
-గంగం శ్రీనివాస్రెడ్డి, రైతు
మార్కెట్లో కిలో బియ్యం రూ.250-300
బ్లాక్ రైస్-2841 రకం కేజీ బియ్యం మార్కెట్లో ధర రూ.250-300 పలుకుతున్నది. పై పొరలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండడం వల్ల బియ్యం నల్ల రంగులో ఉంటయ్. ఈ బియ్యంలో అత్యధిక పోషక విలువలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీ, షుగర్, కాన్సర్, హార్ట్ పేషెంట్స్కు ఎంతో మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మామూలు బియ్యంతో పోలిస్తే ఈ బియ్యంలో ఐరన్, జింక్ ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.
-రాజ్కుమార్, ఏఈవో