వాతావరణంలో మార్పుల దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం తరలింపు తదితర అంశాలపై నిర్మల్ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా కాలంలో రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. రైతులకు రూ. రూ. 44కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వర్షం పడితే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని ఏరోజుకారోజు తూకం వేసి రైస్మిల్లర్లకు లారీల ద్వారా సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో 250 లారీలతో ధాన్యాన్ని రైస్మిల్లర్లకు పంపిస్తున్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మంత్రికి వివరించారు. వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దించుకునేలా రైస్మిల్లర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి రైతులకు నష్టం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, టీ రాంబాబు, డీఎస్వో కిరణ్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.