అనుబంధంగా నర్సింగ్ కాలేజీ lమెడికల్ రీజనల్ సబ్ సెంటర్గా జిల్లా
మందుల కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు నిర్ణయం
మూడు జిల్లాల ప్రజలకు అందనున్న వైద్య సేవలు lజిల్లా ప్రజల హర్షాతిరేకం
జగిత్యాల, మే 18 (నమస్తే తెలంగాణ): రెండున్నరేళ్ల క్రితం ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకొన్నారు. జగిత్యాల జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించడంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. వైద్య కళాశాలతోపాటు నర్సింగ్ కాలేజీ, మెడికల్ రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటు కానుండడంతో జిల్లా మెడికల్ హబ్గా మారనున్నది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణా కేంద్రం, డయాలసిస్ సౌకర్యం, సర్వరోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం అందుబాటులోకి రాగా, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో తాజాగా వైద్య కళాశాల రానుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల వైద్య సదుపాయాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నది. జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో జిల్లా రూపురేఖలే మారనున్నాయి. మెడికల్ కాలేజీతోపాటు, నర్సింగ్ కాలేజీ, మెడికల్ రీజినల్ సబ్ సెంటర్, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రం, మాతా శిశు సంరక్షణా కేంద్రం.. ఇలా అన్ని రకాల వైద్య సదుపాయాలు జగిత్యాల ప్రాంత వాసులకు అందుబాటులోకి రానున్నాయి. సుదీర్ఘకాలంగా వైద్య కళాశాల, ఇతర వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్న జగిత్యాల ప్రాంత ప్రజల సాకారం కానున్నది. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని, అలాగే మెడికల్ రీజనల్ సబ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, మంజూరు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రజాప్రతినిధుల చొరవతో..
జగిత్యాల జిల్లాతో పాటు, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చేరువగా ఉన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడితే ఆయా జిల్లాలకు మేలు జరుగుతుందని, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా ప్రజలు కోరుతూనే వచ్చారు. తెలంగాణ సాధన అనంతరం నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించిన సందర్భంలో కవితతో పాటు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సీఎం కేసీఆర్కు మెడికల్ కాలేజీ ఆవశ్యకతను వివరించారు.
మారనున్న జిల్లా వైద్య రంగ స్వరూపం
వ్యవసాయిక జిల్లా అయిన జగిత్యాలలో విద్యారంగం కొంతవరకు అభివృద్ధి చెందినా, వైద్యరంగంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. జగిత్యాల జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెద్దగా వైద్య సదుపాయాలు లేవు. జగిత్యాలలో ఏరియా దవాఖాన మినహా ఇతర వసతులు లేవు. కేవలం వంద పడకల దవాఖానగా మాత్రమే జగిత్యాల ఏరియా దవాఖాన కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ వచ్చే వరకు ఇందులో అనేక సమస్యలు తిష్ఠవేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మౌలిక వసతులు సమకూరాయి. కొత్తగా వైద్యుల పోస్టులు మంజూరు చేశారు. ఎమ్మెల్సీ కవిత చొరవతో ప్లేట్లెట్ సపరేట్ మిషన్ అమర్చారు. డయాలసిస్ సౌకర్యం కల్పించారు. ఇటీవలే సర్వరోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభమైంది. నర్సింగ్ కాలేజీ భవనం పూర్తయింది. జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణా కేంద్రం పూర్తయింది. వైరాలజీ ల్యాబ్ మంజూరు కాగా, దాని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ, మెడికల్ రీజినల్ సబ్బోర్డు ఏర్పాటుతో జగిత్యాల జిల్లా వైద్యరంగం స్వరూపం పూర్తిగా మారిపోనుంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 300 నుంచి 500 పడకల దవాఖాన అందుబాటులోకి రానుంది.
స్పెషలిస్ట్ వైద్యులు, వివిధ కేటగిరీలో సూపర్ స్పెషలిస్టులైన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు జూనియర్ డాక్టర్లుగా సేవలందిస్తారు. ఇక మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తే, పారామెడికల్ సిబ్బంది పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తారు. మొత్తంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు జగిత్యాల వైద్యరంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మెడికల్ రీజినల్ సబ్ సెంటర్ వైద్యానికి సంబంధించిన మౌలిక వసతుల కేంద్రంగా ఉంటుంది. దీని పరిధిలోని దవాఖానలకు సంబంధించిన మందులన్నింటినీ భద్రపరుస్తారు. మందులను నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తారు. వ్యాక్సిన్లన్నీ ఇకముందు సబ్ సెంటర్ పరిధిలోనే ఉంటాయి. హైదరాబాద్ నుంచి మందులు, ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు అన్ని సబ్ సెంటర్కే బట్వాడా చేస్తారు. ఇక్కడి నుంచి వాహనాల ద్వారా సెంటర్ పరిధిలోని హాస్పిటళ్లకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. మొత్తంగా మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటు జగిత్యాల జిల్లా అభివృద్ధిలో కీలక మలుపు కానుంది.
జిల్లా కీర్తి కిరీటంలో కలికితురాయి
జగిత్యాల జిల్లా కీర్తి కిరీటంలో కలికితురాయిగా మెడికల్ కాలేజీ నిలుస్తుంది. మెడికల్ కాలేజీ కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. జగిత్యాలలో విద్య సదుపాయాలు, సేద్య రంగంలో అభివృద్ధిని సాధించినా వైద్యరంగంలో మెరుగైన సౌకర్యాలు లేవు. సీఎం కేసీఆర్ మెడికల్, నర్సింగ్ కాలేజీ, రీజినల్ మెడికల్ సబ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించడంతో జగిత్యాల ప్రాంత ప్రజల ఇబ్బందులు దాదాపుగా తొలిగిపోతాయి. కోరుట్ల, మెట్పల్లి ప్రాంత ప్రజలు వైద్యం కోసం నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ వెళ్తున్నారు. మెడికల్ కాలేజీ వస్తే, వారందరికీ జగిత్యాలలోనే మెరుగైన వైద్యం అందుతుంది. జిల్లా ప్రజల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
జగిత్యాల జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ లోక్సభ సభ్యురాలిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశా. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల జిల్లావాసులకు కలిగే వైద్య సదుపాయాలను ముఖ్యమంత్రికి వివరించా. దీంతో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో జగిత్యాల జిల్లాకు వైద్య సదుపాయాలు మెరుగవుతాయి. జగిత్యాల అభివృద్ధి బాటలో సాగుతుంది. ప్రజా సంక్షేమంపై ఎప్పుడూ అంకితభావంతో ఆలోచించే సీఎం కేసీఆర్కు జగిత్యాల ప్రజలు రుణపడి ఉంటారు.