రూ.5కే కడుపు నిండా భోజనం
రోజుకో వెరైటీ కర్రీ
నిత్యం 250 మందికి పైనే భోజనం
కొత్తగూడెం అర్బన్, మే 18 : అన్నపూర్ణ క్యాంటీన్ పేదల కడుపు నింపుతున్నది. రోడ్డుపై ఏ ఆధారం లేక బతుకువెళ్లదీస్తున్న యాచకుల ఆకలి తీరుస్తున్నది. చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న చిరు ఉద్యోగులకు, అడ్డామీద కూలీలకు, హోటళ్లలో తినేందుకు సరిపడా డబ్బులు లేని మధ్యతరగతి, జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తున్నవారికి, వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు, ఇలా ప్రజలకు పలు రకాల కర్రీలతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నది ‘అన్నపూర్ణ’ క్యాంటీన్. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల నుంచి ఆకలితో ఉన్న ఎంతో మంది అన్నార్తులకు కడుపునిండా భోజనం అందిస్తున్నది.
రూ.5కే ప్లేట్ భోజనం.. రోజుకో వైరైటీ కర్రీ
రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర ఆధ్వర్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా ఈ అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించింది. శుభ్రత విషయంలో రాజీ లేకుండా కేవలం రూ.5కే రుచికరమైన భోజనాన్ని అందిస్తూ అందరి కళ్లల్లో ఆనందం నింపుతోంది. భోజనంతోపాటు రోజుకొక కర్రీ, పచ్చడి, సాంబార్ వంటివి అందిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. సూర్యాప్యాలెస్ సెంటర్లో అందించే ఈ భోజనానికి మధ్యాహ్నం నుంచే క్యూ కడుతారు. ప్రతిరోజు 250 మందికి సరిపడా భోజనాన్ని తయారు చేసి అందిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, స్థానికంగా పనిచేసేవారు టోకెన్లు తీసుకొని భోజనం కోసం సిద్ధంగా ఉంటారు.
లాక్డౌన్ వేళ ఆదుకుంటున్న క్యాంటీన్
గతేడాది లాక్డౌన్ మొదలుకొని.. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాంటీనే పేదలు, యాచకులు, వలస కూలీలకు దిక్కైంది. లాక్డౌన్ పెట్టినప్పటికీ భోజనాన్ని అందించండంలో వెనుకడుగు వేయలేదు. ఎవరో వచ్చి తమకు అన్నం అందిస్తారనే ఆశ లేకుండా జేబులో రూ.5లు ఉంటే చాలనుకొని ధైర్యంగా అన్నపూర్ణ క్యాంటీన్కు వెళ్లి భోజనం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సిబ్బంది వారికి అన్నం పెడుతూ కడుపునింపుతున్నారు.
భోజనం మంచిగా ఉంటుంది
క్యాంటీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ భోజనం చేస్తున్నా. మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ పనిదగ్గరికి వెళ్లడంతో టైం అయిపోతుంది. అందుకే ఇక్కడ తిని వెళ్లి పని చేసుకుంటున్నా. ఇంట్లో వండినట్లే ఉంటుంది. కడుపునింపు కోవడానికి పేదోళ్లకు రోజుకొక కర్రీ ప్రతిరోజు సాంబార్, పచ్చడి ఇంతకంటే ఏం కావాలి.
-రమేశ్ (స్థానిక ఎలక్ట్రిషీయన్)