జిల్లాలో 104 సబ్ సెంటర్లు ఏర్పాటు
మొదటి విడుతలో 65 కేంద్రాల్లో అమలు
అందుబాటులో డాక్టర్లు, సిబ్బంది
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు
బచ్చన్నపేట, అక్టోబర్ 17 :గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో పల్లెదవాఖానలకు సర్కారు శ్రీకారం చుట్టింది. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సత్ఫలితాలిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన వైద్యం అందించేందుకు కార్యాచరణ చేపట్టారు. జిల్లాలో 104 హెల్త్ సబ్సెంటర్లుండగా మొదటి విడుతలో 65 కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు తగినంత సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని హెల్త్ సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇందుకోసం తగినంత వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో స్థానికంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 12 మండలాలుండగా, 281 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తం 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 104 ఉప కేంద్రాలు, 4 సీహెచ్సీలు, అర్బన్ సెంటర్ ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 65 సబ్సెంటర్లను గుర్తించి పల్లెదవాఖానలుగా మారుస్తున్నారు. మిగిలిన కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే..
అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి అన్న నినాదంతో సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నది. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందరికీ విద్య, వైద్యం, అందించేందుకు చర్యలు చేపట్టారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికా బద్ధ్దంగా పాలన సాగిస్తున్నారు. రైతుబాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. మరోవైపు పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. పీహెచ్సీల్లో వసతులు పెంచడంతో అత్యధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. అమ్మ ఒడి పథకం, కేసీఆర్ కిట్తో లబ్ధిదారులకు మేలు జరుగుతున్నది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలతోపాటు గ్రామాల్లోని 11 పీహెచ్సీ ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. పల్లెల్లోని సబ్సెంటర్లను దవాఖానలుగా మార్చి ఎంబీబీఎస్, అయూష్ డాక్టర్లను నియమించారు.
ఐదు వేల జనాభాకు దవాఖాన..
ఒక్కో పీహెచ్సీని 40 వేల జనాభాకు ఉపయోగపడేలా నిర్మించారు. ప్రస్తుతం 5 వేల జనాభాకు తగినట్లుగా పల్లె దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంబీబీఎస్, అయూష్ డాక్టర్లతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించనున్నారు. దవాఖానలో ఓపీ నిర్వహిస్తూ బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులు, జ్వరా లు ఇమ్యునైజేషన్, మాతా శిశు సంరక్షణకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 13 మంది డాక్టర్లు విధుల్లో చేరి వైద్యం అందిస్తున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది
జిల్లాలో పల్లెదవాఖానల ఏర్పాటుకు కృషి చేస్తున్నం. జిల్లాలో 104 సబ్సెంటర్లుండగా, వీటిలో మొదటి విడుతగా 65 ఉప కేంద్రాలను గుర్తించి మరిన్ని వైద్య సేవలందిస్తున్నం. కొన్ని సబ్సెంటర్లలో డాక్టర్లు అందుబాటులో ఉండగా, మిగిలిన కేంద్రాల్లో త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పల్లెదవాఖానల్లో పీహెచ్సీల మాదిరిగానే వైద్యం అందుతుంది. దశల వారీగా జిల్లాలోని అన్ని సబ్ సెంటర్లను పల్లెదవాఖానలుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినం.