జూరాలకు 70వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మూడు గేట్లతో దిగువకు విడుదల
టీబీ డ్యాంకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలం డ్యాం నాలుగు గేట్లు ఎత్తివేత
నిండుకుండల్లా ప్రాజెక్టులు
శ్రీశైలం, సెప్టెంబర్ 17 : ఎగువనుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి చేరుతున్నది. జూరాల గేట్ల నుంచి 21,024, పవర్హౌస్ నుంచి 35,807, సుంకేసుల నుంచి 29,939క్యూసెక్కులు విడుదల చేయ గా.. మొత్తం 86,770క్యూసెక్కులు శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నాయి. కాగా, శుక్రవారం రాత్రి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,89,000క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో నాలుగు గేట్లు పది అడుగులమేర ఎత్తి 1,11,932 క్యూసెక్కులు విడుదల చేశారు. ఏపీ పవర్హౌస్కు 23,275, టీఎస్ పవర్హౌస్కు 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి 1,66,991 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.8824 టీఎంసీలు నిల్వ ఉన్నది.
జూరాలకు తగ్గిన వరద
ఆత్మకూరు, సెప్టెంబర్ 17: జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. గురువారం 2లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, శుక్రవారం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రికి 70వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 3గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 21,024 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమకాల్వకు 820, కుడికాల్వకు 672, సమాంతర కాల్వకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 35,087క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 11యూనిట్లలో విద్యుదుత్పత్తి అవుతున్నది. ఎగువ జూరాలలో 5యూనిట్ల ద్వారా 2.77మి.యూ. ఉత్పత్తితో కలిపి మొత్తం 175.861మి.యూ. ఉత్పత్తి చేశారు. దిగువ జలవిద్యుత్కేంద్రంలో 6యూనిట్ల ద్వారా 3.511 మి.యూ. మొత్తంగా 194.730మి. యూ. ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కాగా, శుక్రవారం రాత్రి 8.710టీఎంసీలు నమోదైంది. ప్రాజెక్టు నుంచి 59,941క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.
తుంగభద్ర డ్యాంకు..
అయిజ, సెప్టెంబర్17 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువనుంచి వరద చేరుతుండటంతో 10గేట్లు రెండు అడుగులు ఎత్తి 19,549 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఇన్ఫ్లో 31,644, అవుట్ఫ్లో 31,174క్యూసెక్కులు నమోదైంది. 100. 855 టీఎంసీల సామర్థ్యం గల టీబీడ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం 100.778 టీఎంసీలు ఉన్నది. 1633అడుగుల నీటిమట్టానికి గానూ 1632.98 అడుగులు ఉన్నట్లు టీబీబోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన టీబీడ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద వచ్చిచేరుతున్నది. శుక్రవారం ఆనకట్టకు 18,843 ఇన్ఫ్లో ఉండగా, 18,400 క్యూసెక్కుల వరద ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.6అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 443క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.