కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలి
ఈటలకు ఆస్తులపైనే తాపత్రయం
ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డి
ఇల్లందకుంటలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఇల్లందకుంట జూన్17 : రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్లో గులాబీ జెండాను ఎగరేయాలని, నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తుంటే.. పరిగె అని మాట్లాడి పేదలను అవమానించారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమమే కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో పేదలపై పెను భారం పడుతున్నదని, నల్ల చట్టాలను తెస్తూ రైతుల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రంలోని 4.50 లక్షల మందికి రేషన్ కార్డులు అందజేస్తామని, రాష్ట్రంలో 57 ఏండ్లు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులపై ఉన్న తాపత్రయం.. అభివృద్ధిపై లేదని.. నియోజకవర్గ ప్రగతిని ఏనాడైనా పట్టించుకున్నాడా అని మండిపడ్డారు. గ్రామాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రైతు బంధు డబ్బులు ఈనెల 25 వరకు ప్రతి ఒక రైతు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
కడుపులో విషం పెట్టుకొని పనిచేసిండు: ఎమ్మెల్యే రవిశంకర్
మాజీ మంత్రి ఈటల ఇన్నాళ్లూ ప్రభుత్వంలో ఉంటూ కడుపులో విషం పెట్టుకొని పని చేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇల్లందకుంటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆత్మగౌరవం పేరుతో ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటలకు టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించి, సొంత తమ్ముని వలె చూసుకున్నప్పటికీ వెన్నుపోటు పొడిచేందుకు యత్నించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, సర్పంచులు, దిలీప్రెడ్డి, రాజు, మెగిళి, వెంకటస్వామి, వనమాల, లలిత, మానస, రజిత, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, ఓదెలు, విజయ, రమ, చిన్నరాయుడు నాయకులు గణపతి, వీరన్న, తిరుపతిరెడ్డి, కుమార్, రాంస్వరణ్రెడ్డి, వీరారెడ్డి ఉన్నారు.