ఖమ్మం, జూన్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం సీజేఐని కలిసి శ్రీసీతారామచంద్రస్వామి ప్రతిమ అందించి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ 1966-67 సంవత్సరంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు తరువాత అరుదైన ఘనతను గడించిన వ్యక్తిగా నిలిచారని అన్నారు. సీజేఐగా తెలుగు వ్యక్తి ఉండడం ఉభయ రాష్ర్టాల ప్రజలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా మరెన్నో చారిత్రక తీర్పులు ఇచ్చి తెలుగువారి కీర్తిని ఇనుమడింప జేయాలని ఆకాంక్షించారు. కొద్దిసేపు స్మృతులను నెమరు వేసుకున్నారు.