కరోనా కట్టడి కోసం వలంటీర్ల నియామకానికి పోలీసుశాఖ చర్యలు
రాంనగర్, మే 17;కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలని ఉందా..? మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారి కోసం పోలీసుశాఖ ఆహ్వానం పలుకుతున్నది. కొవిడ్ నివారణలో వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నది. స్వచ్ఛందంగా ముందుకువచ్చే వారిని నియమించుకొని జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో గస్తీకి ఉంచాలని భావిస్తున్నది.
కరోనా కట్టడికి వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో లాక్డౌన్ సందర్భంగా వలంటీర్ల సేవలను పోలీసులు సద్వినియోగం చేసుకున్న విషయం విదితమే. అప్పుడు సేవలందించిన వలంటీర్లతో పాటు స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారిని నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఉదయం 7 నుంచి 10 గంటల దాకా కూరగాయల మారెట్లు, షాపింగ్ మాల్స్ వద్ద ప్రజలు భౌతికదూరం పాటించేలా చూడడం, కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించడం లాంటి పనులు అప్పజెప్పనున్నారు. వలంటీర్ల పర్యవేక్షణ బాధ్యతలను టౌన్ అడిషనల్ డీసీపీ అశోక్కు అప్పగించారు. కమిషనరేట్ ప్రాంతాల్లో కూడా వలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు.
కొవిడ్ నిబంధనలపై ప్రచారం
కొవిడ్ నియమ నిబంధనలపై పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సడలింపు టైంలో జనం గూమిగూడుతున్న మారెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలున్న ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి వాడలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్ పెట్టుకున్నా ముక్కు కిందికి ఉండవద్దని, మాస్క్ను పూర్తిగా ధరిస్తేనే రక్షణ ఉంటుందనే విషయాన్ని విడమరిచి చెబుతున్నారు.
1472 కేసులు.. 357 వాహనాలు సీజ్
లాక్డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం వరకు 1472 కేసులు నమోదు చేశారు. ఇందులో మాస్కులు పెట్టుకోకపోవడంపై 703, భౌతికదూరం పాటించకపోవడం 209, ఎకువ మొత్తంలో గుమిగూడి ఉండడం 48, లాక్డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి 488, ఇతర కేసులు 24 నమోదు చేశారు. అలాగే కమిషనరేట్ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న సమయాల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 357 వాహనాలను సీజ్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్రెడ్డి తెలిపారు.