వైరస్ వ్యాప్తికి అందని గ్రామం
ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నిల్
సంపూర్ణ ఆరోగ్యమని తేల్చిన ఫీవర్ సర్వే
ఆహార అలవాట్లే కారణమంటున్న గ్రామస్తులు
కోటపల్లి, మే 17: మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామం సమీపంలోని ఎర్రాయిపేట గ్రామంలో 55 కుటుంబాలు ఉండగా, 250 మంది జనాభా నివసిస్తున్నారు. వీరంతా గిరిజనులే. వ్యవసాయం, చేపలు పట్టడం, ఉపాధి పనులకు వెళ్లడం వీరి దినచర్య. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు, మొదట్లో అంతగా అవగాహన లేకపోయినా, మిగతా ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులను చూసి అప్రమత్తమయ్యారు. కరోనా వస్తే కలిగే దుష్పరిణామాలపై స్పష్టమైన అవగాహన పెంచుకొని గ్రామంలోకి కొత్త వ్యక్తులకు అనుమతి నిరాకరంచారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే వారితో సామాజిక దూరం పాటించి తిరిగి పంపించడం చేస్తున్నారు. యేటా గ్రామ దేవతలకు పూజలు చేయడం, గట్కా, అంబలి లాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్లే తామంతా ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. కష్టించి పనిచేయడమే తమ సంపూర్ణ ఆరోగ్యానికి కారణమని తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో వారానికి మూడు రోజులు పారిశుధ్య పనులు చేపడుతూ, పల్లెను స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జ్వర సర్వే నిర్వహించగా, ఈ గ్రామంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది.
సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం..
మొదటి, రెండో దశల్లో కరోనా మా ఊరి దరిదాపుల కు కూడా రాలేదు. అందరూ కష్టపడి పనిచేసేతత్వం కల వారే ఉండడంతో నేటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంబలి, గట్కా వంటి ఆహారమే సంపూర్ణ ఆరోగ్యం గా ఉండడానికి కారణం. గ్రామస్తులమంతా వైరస్ వ్యాపించకుండా పలు నిబంధనలు పాటిస్తున్నాం. పక్క ఊర్లకు పోయినా, పనికి పోయి ఇంటికి వచ్చి నా పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం.
-రేగుంట ప్రసాద్, ఎర్రాయిపేట
జ్వరం కేసులు నమోదు కాలేదు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే నిర్వహించగా, మా గ్రామంలో ఒక్క జ్వరం కేసు కూడా నమోదు కాలేదు. చిన్న గ్రామం కావడంతో పకడ్బందీగా సర్వే చేయడంతో పాటు అందరి పూర్తి వివరాలను సేకరించాం. జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని చెబుతున్నాం. కరోనా నివారణ చర్యల పై గ్రామస్తులకు సంపూర్ణ అవగాహన కల్పించాం. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి కరోనా నిబంధనలను అమలు చేస్తుండడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య జీరోగా ఉంది.
-మెట్పల్లి భారతి, అంగన్వాడీ కార్యకర్త