ఇదే స్ఫూర్తితో మెరుగైన వైద్యమందించాలి
మెరుగైన అందేలా నిరంతరం పర్యవేక్షణ
హై పవర్ కమిటీ సమావేశంలో మంత్రి అజయ్
మామిళ్లగూడెం, మే 17: జిల్లాలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. వైద్యులు కూడా స్ఫూర్తితో వైద్యం అందించి బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ మరింత సమర్థవంతగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో జడ్పీ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి హైపవర్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొవిడ్ నివారణ చర్యలు, ఆక్సీజన్, బెడ్లు, మందుల లభ్యత, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపర్ కమిటీతోపాటు జిల్లాలోని ప్రైవేట్ కొవిడ్ హాస్పిటళ్ల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ రోజుకు కనీసం ఐదు ఆస్పతుల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టాలని ఆదేశించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో 1485 బృందాలు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 5,60,113 ఇళ్లను సందర్శించి 5,698 మంది కొవిడ్ పాజిటివ్ పెషేంట్లను గుర్తించాయని చెప్పారు. కొవిడ్ లక్షణాలు కలిగిన 10,531 మందిని గుర్తించామని, ఇప్పటి వరకు 8,707 కిట్లను అందించామని అన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి లాక్డౌన్ను అమలు చేస్తున్నామన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలు, అంబులెన్సుల ధరల నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లాక్డౌన్ నింబంధనలను ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. అనంతరం ఔషధ పంపిణీ వాహనాలను, అన్నపూర్ణ భోజన వాహనాలను మంత్రి అజయ్ జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఐఎంఏ సెక్రటరి డాక్టర్ కూరపాటి ప్రదీప్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఏసీపీలు రామానుజం, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.