పెద్దపల్లి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ);కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం దసరా వేడుకలు అంబరాన్నంటాయి.. తెల్లవారుజామునుంచే ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.. భక్తి శ్రద్ధలతో శమీ, ఆయుధ, వాహన పూజలు చేశారు. సాయంత్రం వేళ ప్రజలందరూ పరస్పరం జమ్మి ఆకులను పంచుతూ అలయ్..బలయ్ తీసుకుంటూ సంతోషంలో మునిగితేలారు. పలుచోట్ల నిర్వహించిన రామ్లీల (రావణ దహనం)కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను వైభవంగా జరుపు కున్నారు. ఉదయాన్నే నూతన వస్ర్తాలు ధరించి ఆలయాలకు వెళ్లారు. దుర్గాదేవీ మండపాల వద్ద వాహనాలకు, ఆలయా లు, కార్యాలయాల్లో ఆయుధ పూజ చేశారు. సాయంత్రం వేళలో గ్రామ దేవతలు, శమీ వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాత్రి వేళలో దుర్గామాత శోభాయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే పలు చోట్ల రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జ్యోతి ప్రజల్వన చేసి ఉత్సవాలను ప్రారంభించగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజయ్యారు. కళాకారుడు మేజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ కం ట్రోల్ ద్వారా ఫైర్ షో, రావణ వధ ఘట్టాలను మంత్రి చేపట్టారు. గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మరో 20 ఏండ్ల దాకా రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుదని మంత్రి కొప్పు ల ఈశ్వర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కావాలని ఒక్క మాటలో కోరగానే వెంటనే మం జూరు చేయడమే గాకుండా ఆగమేఘాల మీద పనులు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. రామగుండం నియోజక వర్గ ప్రజల సేవకే తన జీవితం అంకితమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ శంకర్ కుమార్ తదితరులున్నారు. జ్యోతినగర్లో ఎమ్మెల్యే చందర్ అకాడ ప్రదర్శనను ప్రారంభించారు. ఎన్టీపీసీ సీజీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ దంపతులు, రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి ప్రత్యేకంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జంక్షన్/పెద్దపల్లిటౌన్ అక్టోబర్ 16: జిల్లా కేం ద్రంలో విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన దసరా వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి ప్రశాంత్రెడ్డి, ఏసీపీ సారంగాపాణి, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐలు రాజేశ్, సహదేవ్సింగ్,కౌన్సిలర్ భిక్షపతి, పెంచాల రమాదేవి,ఎరుకల కల్పన,గాదె మాధవి,పైడ రవి, పూదరి చంద్రశేఖర్,నాయకులు శ్రీధర్, బొడ్డుపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంథని టౌన్/ మంథని రూరల్, అక్టోబర్ 16: శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఆయన సతీమణి పుట్ట శైలజ, కూతురు మౌమిత, కొడుకు శ్రీహర్ష, కోడలు కుశాలితో కలిసి తన ఇంటి వద్ద నుంచి మేళా తాళాల మధ్య పట్టణంలోని వీధుల గుండా కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. మంథని నియోజకవర్గంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.