సినీ దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి
సత్తుపల్లి/ దమ్మపేట/ మణుగూరు రూరల్, అక్టోబర్ 16 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు అని సినీ నటుడు, దర్శక నిర్మాత నారాయణమూర్తి అన్నారు. ‘రైతన్న’ సినిమా ప్రచారంలో భాగంగా శుక్రవారం సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంలోని నివాసంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్శంగా నారాయణమూర్తి మాట్లాడుతూ కొత్త చట్టాలపై నిరసనగా తొమ్మిది నెలలుగా ఢిల్లీ సమీపంలో రైతులు ధర్నాలు, బంద్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు తాము కోరుకునే పంటను పండించుకునే అవకాశం లేకుండా కేంద్రం చట్టాలు రూపొందించిందన్నారు. ఎరువుల ధరలలపై కూడా నియంత్రణ ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. పంట సమయానికి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారన్నారు. ఏడాదిలో రెండు సార్లు రైతుబంధు సాయం అందిస్తున్నారన్నారు. రైతుబీమా పేరుతో ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తున్నారన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించారన్నారు. ఆయా సమావేశాల్లో సీపీఎం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.