ఆపదలో ఆపన్నహస్తం
పెద్దపల్లి జిల్లా దవాఖానలో నిత్యాన్నదానం
సొంత డబ్బులతో మూడేండ్లుగా నిరంతరం సేవలు
పెద్దపల్లిటౌన్, మే 16: రోగులకు సరైన వైద్యంతోపాటు పోషకాహారం అందితేనే జబ్బు నుంచి త్వరగా కోలుకుంటారు. పెద్దపల్లి ప్రభు త్వ దవాఖానలో షేపెంట్లకు సర్కార్ వైద్య సేవలందిస్తుండగా, సత్యసాయి నిత్యాన్నదాన వేదిక సంపూర్ణ ఆహారాన్ని రెండు పూటలా అందిస్తున్నది. మూడేండ్లుగా సొంత నిధులతో నిరంతరం సేవలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నది.
మూడేళ్ల క్రితం ప్రారంభం
సత్యసాయి నిత్యాన్నదాన వేదికను మూ డేండ్ల క్రితం ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితికి చెందిన 200 మంది సభ్యులు వేదికను ఏర్పాటు చేశారు. దవాఖానలో చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్యను బట్టి పౌష్టికాహారాన్ని తయారు చేస్తూ వారికి అందిస్తున్నారు. రోజూ రెండుపూటలా భోజనం పెడుతున్నారు. రోగుల సంఖ్యను బట్టి 30 నుంచి 50మందికి వేడి వేడి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
సభ్యులే దాతలుగా..
వేదికను ఏర్పాటు చేసిన సభ్యులే దాతలుగా భోజనం అందించడం విశేషం. బయటి వ్యక్తుల నుంచి సహకారం పొందకుండా వంతులవారీగా అన్నదాన కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తూ విశేష సేవలందిస్తున్నారు.
కరోనా వేళ ..
గతేడాది కరోనా విజృంభించిన సమయంలో సైతం సభ్యులు తమ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించారు. దీంతో జిల్లావ్యాప్తంగా వేదికకు మంచి పేరు లభించింది. ఈ ఏడాది కూడా నిత్యాన్నదానాన్ని చేపట్టాలని వారిని జిల్లా అధికారులు కోరడం విశేషం. అధికారుల సూచనల మేరకు భోజనం మెనూలో మార్పులు చేశారు. సన్న బియ్యం, రెండురకాల కూరలతోపాటు, పెరుగు, పండ్లు, స్వీట్లు అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.
మంత్రి అభినందన
వేదిక సేవా కార్యక్రమాలపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వేదిక కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సతీమణితో కలిసి సందర్శించారు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. వారిని అభినందించారు.