నగరాన్ని కాపాడుతున్న బల్దియా పారిశుధ్య కార్మికులు
ఏడాదిన్నరగా కరోనాతో యుద్ధం
కోల్సిటీ, మే 16: ఏడాదిన్నర కాలంగా నగర ప్రజలను సురక్షితంగా కాపాడుతున్నది పారిశుధ్య కార్మికులు. అలాంటి సాహస వీరుల సేవలకు అందరూ సలాం చేస్తున్నారు.
నిర్విఘ్నంగా సేవలు..
రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో 580 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ ప్రాంతాల్లో వీరం తా షిఫ్టుల వారీగా 24 గంటల పాటు పనులు అప్పగిస్తారు. ఈ పారిశుధ్య పనులను 12 మంది సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని వివిధ పరిశ్రమలు, ప్రధాన వ్యాపార ప్రాంతాలు, నివాస గృహాలు, కాలువలు, భూగ ర్భ డ్రైనేజీల నుంచి వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని సుందరంగా ఉంచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఈ సెకండ్వేవ్ పీరియడ్లో నగరంలోని వివిధ డివిజన్లలో హైపోక్లోరైట్ పిచికారీ చేయడం కోసం కార్పొరేషన్లో రూ.7లక్షలు ఖర్చు చేసి 15వేల లీటర్ల ద్రావణాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు సుమారు 5వేల లీటర్ల ద్రావణాన్ని కార్మికులు పిచికారీ చేశారు. అలాగే రూ.5లక్షల వ్యయంతో బ్లీచింగ్ పౌడర్ను కొనుగోలు చేశారు. పారిశుధ్యాన్ని పటిష్టం చేసేందుకు మరో రూ.5లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు పారిశుధ్య అధికారులు తెలిపారు.
కార్మికుల రక్షణకు..
నిత్యం ఉదయం నుంచి సాయంత్రం 5 గం టల వరకు పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులకు రక్షణ కవచాలుగా 10 ఎంఎల్ సామర్థ్యంతో రూ.2లక్షలతో 5వేల శానిటైజర్ బాటిల్స్ను తెప్పించగా, రూ.4లక్షలతో మాస్క్లు, గ్లౌజ్లను అందుబాటులో ఉంచామని శానిటరీ ఇన్స్పెక్టర్ కిశోర్కుమార్ తెలిపారు.
ప్రత్యేక దృష్టి..
రోజూ ఉదయం నగర పాలక సంస్థ కమిషనర్ పీ ఉదయ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిశోర్ కుమార్ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంలో ఇతోధికంగా సేవలందించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. కార్పొరేషన్ నిధుల నుంచి పారిశుధ్య కార్మికుల కోసం ఎప్పటికప్పుడు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్లు, గ్లౌజ్లను అందుబాటులో ఉంచుతున్నారు.