ఉట్నూర్, మే 16: కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంలో ఐదో రోజూ ఆదివారం పకడ్బందీగా కొనసాగింది. అంబేద్కర్, జగ్జీవన్రాం, ఎన్టీఆర్, వినాయక్ చౌక్ల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. బైక్లపై తిరుగుతున్న వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చిన వారికి సీఐ నరేశ్కుమార్, ఎస్ఐ సుబ్బారావు, ట్రైనీ ఎస్ఐ రాజమణి జరిమానా విధించారు.
చెక్పోస్టు తనిఖీ
నార్నూర్, మే 16: గాదిగూడ మండలం లోకారి(కే) చెక్పోస్టును ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ తనిఖీ చేశారు. పలు వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. నార్నూర్లో ఎస్ఐ డీ రమేశ్ పర్యవేక్షించారు. మాస్కు ధరించకపోతే, రోడ్లపై కారణాలు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నార్నూర్, లోకారి, గాదిగూడ, తాడిహత్నూర్, మేడిగూడ మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేశారు. ప్రజల రాకపోకలు లేకపోవడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
సరిహద్దు కట్టుదిట్టం
బేల, మే 16: మహారాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎవరినీ రానివ్వకుండా మరింత కఠినమైన చర్యలను పోలీసులు చేపడుతున్నారు. చెక్పోస్టు వద్ద వాహనాలను ఎస్ఐ సాయన్న తనిఖీ చేశారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బోథ్లో..
బోథ్, మే 16: బోథ్, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్(బీ), పొచ్చెర గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. బోథ్ సీఐ నైలు, ఎస్ఐ రాజు అనుమతి లేని వాహనాలను నిలిపి జరిమానా విధించారు. నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఇంద్రవెల్లి, మే 16: మండలంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగ్నాథ్ హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు ముత్నూర్, ధనోరా(బీ) గ్రామాల్లో ప్రధాన చౌక్లు వెలవెలబోయాయి. గ్రామాలకు వెళ్లడానికి వాహనాలు లేకపోవడంతో ప్రజలు నడిచి వెళ్లారు. మెడికల షాపు వద్ద ప్రజలు మందులు కొనుగోలు చేస్తూ కనిపించారు.
రోడ్లపైకి వస్తే జరిమానా విధిస్తాం
భీంపూర్, మే 16: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్కు అందరూ సహకరించాలని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఎస్ఐ శిరీష అన్నారు. తాంసి మండలంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే జరిమానా విధించారు. నిత్యం వందల వాహనాలు నడిచే తెలంగాణ- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రహదారి లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారింది.
భీంపూర్, మే 16: కరంజి(టీ), గుబ్డి, వడూర్, గొల్లగడ్, గోవింద్పూర్ శివారుల నుంచి మహారాష్ట్ర వాసులు రాకుండా గ్రామస్తులు కట్టడి చేస్తున్నారు. ఎస్ఐ రవీందర్ కరంజి(టీ) రూట్లో గస్తీ నిర్వహించారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, మే 16: మండల కేంద్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేశారు. ఆదివారం కావడంతో ఉదయం చికెన్, మటన్ దుకాణాల ఎదుట మాంసం కొనుగోళ్లకు ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయం ముగియగానే స్వచ్ఛందంగా వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.