మురిపిస్తున్న మల్కాపూర్
అడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు
అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు
చేవెళ్ల టౌన్, జూలై 14 : చేవెళ్ల మండలపరిధిలోని మల్కాపూర్ గ్రామం చూపరులను మరిపిస్తున్నది. పల్లె ప్రకృతివనం గ్రామానికి కొత్త శోభను తెచ్చింది. ఈ వనాన్ని ప్రతి రోజూ సర్పంచ్ శివారెడ్డి, ఉపసర్పంచ్ సయ్యద్ జాఫర్, కార్యదర్శి అనిత పర్యవేక్షిస్తున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్ ఓవర్ ఫ్లో అయినప్పుడు నీరు వృథా పోకుండా ఆ నీటిని మోటర్ ద్వారా మొక్కలకు అందిస్తూ సంరక్షిస్తున్నారు. ఈ వనంలో వేప, రావి, ఉసిరి, గుల్మొహర్, బొప్పాయి, జామ, దానిమ్మ, కానుగ, అల్లనేరేడు, అశోక తదితర మొక్కలను నాటి పెంచుతున్నారు. మొక్కలకు నీరు పెట్టడంతోపాటు కలుపు తీసి సంరక్షించేందుకు గ్రామపంచాయతీ సిబ్బందికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒకరిని నియమించారు. వనం చుట్టూ జాలితో పాటు గేటు, పెద్ద ముఖద్వారం, నడకకు రోడ్లు, సేద తీరేందుకు బెంచీలను ఏర్పాటు చేశారు.
7,500 మొక్కలు పెంపకం
మల్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో 7500 మొక్కలను పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో 3500 మొక్కలను పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇటీవలే చేవెళ్ల ఎంపీడీవో హరీశ్కుమార్ ప్రకృతివనం నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. ప్రకృతివనంలో పెంచుతున్న ప్రతి మొక్కను బతికించడంతోపాటు మొక్కలను వృక్షాలుగా పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మొక్కలకు నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా ఓ మనిషిని నియమించి, వనం చుట్టూ జాలి ఏర్పాటు చేసి ముఖద్వారం, గేటు, నడిచేందుకు విశాలమైన రోడ్లు వేశాం.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి : పురుషోత్తం, కో-ఆప్షన్ సభ్యుడు 70 ఏండ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలను చేపడుతున్నది.