చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణాలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అర్బన్ కలెక్టరేట్ భవన సముదాయం పరిశీలన
హన్మకొండ, జూన్15 : ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకు నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన హన్మకొండ సుబేదారిలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. ఈ నెల 21న కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని లాంఛనంగా ప్రా రంభిస్తారన్నారు. అదేవిధంగా 24 అంతస్తుల్లో నిర్మించనున్న మల్టీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్కు భూమి పూజ చేస్తారని తెలిపారు. అర్బన్ కలెక్టరేట్ భవన సముదాయానికి రూ.35కోట్లతో అంచనా రూపొందించగా, నిర్మాణ వ్యయం దాదాపు రూ. 57కోట్లు అయిందన్నారు. కాంప్లెక్స్ మొత్తం దాదాపు లక్షా 57వేల అడుగుల విస్తీర్ణంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ధి కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై సీఎం స్వయంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయం సేకరిస్తారని తెలిపారు. వరంగల్ వారసత్వ చరిత్రలో నిలిచిపో యే విధంగా నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సం దర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని మం త్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, సీసీఎఫ్ ఆశ, డీఎఫ్వో అర్పన, డీఆర్వో వాసుచంద్ర, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగేందర్రావు, పాల్గొన్నారు.