సూర్యాపేటలో కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్,జగదీశ్రెడ్డి,కర్నల్ కుటుంబ సభ్యులు
సూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భారత్-చైనా సరిహద్దులో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మహావీరుడు కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబుకు రాష్ట్ర ప్రభుత్వం నిలువెత్తు నివాళి అర్పించింది. భరతమాత ముద్దుబిడ్డ త్యాగం, శౌర్యం చిరస్థాయిగా నిలిచి ఉండేలా సూర్యాపేట పట్టణంలో ఏర్పాటుచేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కోర్టు చౌరస్తాకు సంతోష్బాబు పేరు పెట్టారు. కర్నల్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్న తీరు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి జవాన్కూ, ప్రతి ఆర్మీ అధికారికీ భరోసా ఇస్తుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహావీరచక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు చిరస్మరణీయుడని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం కర్నల్ సంతోష్బాబు తొలి వర్ధంతి సందర్భంగా సూర్యాపేట కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డితో కలిసి ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయగీతాలాపనతోపాటు విగ్రహం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
కర్నల్ సంతోష్బాబు చౌరస్తాగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సంతోష్బాబు కుటుంబానికి ఏమిచ్చినా సరిపోదని, దేశ భధ్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్ఫూర్తిదాయకమైన ఆలోచనా విధానాన్ని దేశ ప్రజలకు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చేలా చక్కటి విగ్రహాన్ని ఏర్పాటుచేసిన మంత్రి జగదీశ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, సంతోష్బాబు విగ్రహాన్ని గొప్పగా రూపొందించిన జేఎన్టీయూ ఫైన్ఆర్ట్స్ కళాశాల విగ్రహ రూపశిల్పి, సూర్యాపేటవాసిశ్రీనివాస్రెడ్డికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, నోముల భగత్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితాఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి కర్నల్ సంతోష్బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్ పాల్గొన్నారు. మొదట మంత్రి కేటీఆర్ సూర్యాపేటకు వస్తుండగా చిట్యాల దగ్గర నార్మాక్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
జనం గుండెల్లో చిరస్థాయిగా కర్నల్ సంతోష్బాబు
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కర్నల్ సంతోష్బాబు సూర్యాపేట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు.. సంతోష్బాబును ఎప్పటికీ గుర్తుంచుకునేలా విగ్రహం ఏర్పాటు చేయాలని ఆ కుటుంబం కోరడం, సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కరోనా సమయంలోనూ ఏడాదిలోగా పూర్తి చేశాం. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన యువ నాయకుడు, తెలంగాణ ఆశా కిరణం మంత్రి కేటీఆర్కు సూర్యాపేట ప్రజల తరఫున ధన్యవాదాలు.
‘దేశం కోసం ప్రాణాలిచ్చిన మీవారిని తీసుకురాలేము. కానీ, మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఎంతో అండగా నిలిచారు. ఇలాంటి సీఎంను దేశంలోనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఎంతో గౌరవం ఇస్తున్నారు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.’
‘డెవలప్ మెంట్’ గ్యాలరీ…
మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు చేరుకున్న మంత్రి కేటీఆర్ 3.10గంటలకు విగ్రహావిష్కరణ పూర్తి చేసి 3.15గంటలకు మంత్రి జగదీశ్రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం 3.50గంటలకు రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెయిన్ రోడ్డు విస్తరణ, రూ.8కోట్లతో చేపట్టే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి పనుల ఫొటో గ్యాలరీని తిలకించారు.