6.7 క్వింటాళ్లు స్వాధీనం
నలుగురి అరెస్ట్.. పరారీలో ఇద్దరు..
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్హెగ్డే
వేములవాడ, జూన్ 15: ఇతర రాష్ర్టాల నుంచి అనుమతి లేకుండా విక్రయిస్తున్న 6.7 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన ముద్దెన వెంకటేశ్వర్లు, అతడి భార్య లక్ష్మి బతుకుదెరువు కోసం 15 సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. రుద్రంగి మండలం మానాలకు చెందిన ముద్దాల భూమయ్య, చందుర్తి మండలం నర్సింగాపూర్కు చెందిన బొడ్డు వినోద, బొడ్డు శ్రీకాంత్, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందరామ్కు చెందిన భూపతి మహేశ్తో వీరు ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి అనుమతి లేని నకిలీ విత్తనాలను దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలతో పోలీసులు దాడులు చేసి సుమారు రూ.12.14లక్షల విలువైన 6.7 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులిద్దరూ పరారీలో ఉండగా, మిగితా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తక్కువ ధరకు వచ్చే విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి సదరు నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి రణధీర్రెడ్డి, డీఎస్పీలు చంద్రకాంత్, రవికుమార్, సీఐలు వెంకటేశ్, శ్రీలత, ఎస్ఐలు శ్రీనివాస్, శేఖర్, మహేశ్ ఉన్నారు.