1,509 పంచాయతీలకు నిధులు విడుదల
ప్రతినెలా అభివృద్ధికి కేటాయింపు
మంచిర్యాల, జూన్ 15(నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా క్రమంతప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల రూపురేఖలు మార్చేలా సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల్లో గల 1,509 పంచాయతీలకు గాను ఇప్పటి వరకు రూ.256.11 కోట్లు అందజేశారు. మంచిర్యాల జిల్లాలోని 310 పంచాయతీలకు రూ.57.82 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని 468 పంచాయతీలకు రూ. 72.47 కోట్లు, నిర్మల్ జిల్లాలోని 396 పంచాయతీలకు రూ.66.92 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 335 పంచాయతీలకు రూ.58.90కోట్లు విడుదలయ్యాయి. చిన్న గ్రామాలకు సైతం నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో ఆదాయం తగ్గినా గ్రామాలకు విడుదల చేసే నిధుల్లో మాత్రం ఆలస్యం చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేకుండా పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి అందుబాటులో ఉన్న నిధులైనా ఖర్చు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. దీంతో గ్రామాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి.
రూ.57.82 కోట్ల నిధులు..
మంచిర్యాల జిల్లాలో 310 పంచాయతీలు ఉన్నాయి. అందులో 196 పాత పంచాయతీలు, 114 కొత్త పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం పంచాయతీల జనాభా 4,57,157. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 4,016 చ.కి.మీ. జిల్లాలో రెండు పంచాయతీ డివిజన్లు, రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని 310 పంచాయతీలకు గాను రూ.57.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మంచిర్యాల రెవెన్యూ డివిజన్లో చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి, లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, దండేపల్లి, జన్నారంతో కలుపుకొని 11 మండలాలు ఉన్నాయి. బెల్లంపల్లి డివిజన్లో బెల్లంపల్లి, కాసిపేట, వేమనపల్లి, నెన్నెల, తాండూర్, భీమిని, కన్నెపల్లితో కలిపి ఏడు మండలాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని 310 పంచాయతీలకు గాను రూ.57.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి.