వైరస్ కట్టడికి ఐక్యమై కదిలిన మహగాం
ప్రస్తుతం కోలుకుంటున్న గ్రామం
రెండో దశ ప్రారంభంలోనే సెల్ఫ్ లాక్డౌన్
20 రోజుల పాటు కట్టుదిట్టంగా అమలు
సహకరించిన గ్రామస్తులు
పూర్తిగా తగ్గిన పాజిటివ్ కేసులు
భైంసా టౌన్, మే 14: నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం మహగాం.. నెలక్రితం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో శుభ, అశుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారితో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పంచాయతీ పాలక వర్గం స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇందుకు గ్రామ ప్రజానీకం సహకరించింది. సుమారు 20 రోజులు పాటు కట్టుదిట్టంగా అమలు చేయడంతో, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా మహగాం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.
మండలంలోని మహగాంలో 4500 జనాభా ఉంది ఈ గ్రామంలో గత నెల నాలుగో తేదీ కంటే ముందు కరోనా పాజిటివ్ కేసులు అనుకోకుండా ఒక్కసారిగా పెరిగిపోయాయి. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని బంధువుల శుభాశుభ కార్యక్రమాలకు హాజరుకావడంతో తెలియకుండానే గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలకు వైరస్ అంటుకుంది. అప్రమత్తమైన సర్పంచ్ అప్పాల రాకేశ్ గ్రామ పెద్దలతో చర్చించి గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ముందస్తుగా రెండు రోజుల సమయాన్ని కేటాయించారు. గ్రామస్తులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని అందుకు సంసిద్ధమయ్యారు. లాక్డౌన్కు ముందుగానే నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఆ విధంగా ఏప్రిల్ 4 నుంచి పది రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. సత్ఫలితాలు కనిపించడంతో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించుకొని రెండవ దశ వైరస్ వ్యాప్తిని కలిసి కట్టుగా అడ్డుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో మూడు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
మళ్లీ రాకుండా జాగ్రత్తగా ఉంటాం
గత నెలలో కరోనా విజృంభించడంతో గ్రామస్తులమంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నాం. లాక్డౌన్ ఫలితంగానే గ్రామంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ముందు కూడా నిబంధనలు పాటిస్తూ గ్రామంలో కరోనా రాకుండా జాగ్రత్తగా ఉంటాం.
సుధాకర్ మసిడ్గే, గ్రామస్తుడు