దండేపల్లి, మే14 : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దండేపల్లి మండలకేంద్రంతో పాటు తాళ్లపేట, ముత్యంపేట గ్రామాల్లో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) వేడుకలను శుక్రవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలకు అవకాశం కల్పించలేదు. నెల రోజులు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఉదయమే ఇండ్లలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) చేశారు. ఇమామ్ అందించిన ఖుత్బా సందేశాన్ని విన్నారు. అనంతరం ఒకరికొకరు ఫోన్ ద్వారా ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇండ్లలో తీపి వంటకాలతో పాటు విందులు చేసుకున్నారు.
సీసీసీ నస్పూర్లో..
సీసీసీ నస్పూర్, మే 14 : సీసీసీ నస్పూర్లో రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సామూహిక ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ముస్లిం మత పెద్దలు మాత్రమే ఆయా ప్రాంతంలోని మసీదుల్లో ప్రార్థనలు చేశారు.
మందమర్రిలో..
మందమర్రి, మే 14 : మందమర్రి పట్టణంలో పవిత్ర రంజాన్ వేడుకలను ముస్లింలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈద్గా లు, మసీదుల్లో ప్రార్థనలు నిలిపివేశారు. ఇంటి వద్దే ఎవరికి వారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇండ్లలోనే ప్రార్థనలు..
రామకృష్ణాపూర్, మే 14 : క్యాతనపల్లి పురపాలక సంఘం పరిధిలోని ముస్లింలు లాక్డౌన్ నిబంధనలకు లోబడి నిరాడంబరంగా శుక్రవారం రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు. ఇండ్లలోనే ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు సెల్ ఫోన్ల ద్వారా తెలుపుకున్నారు.