తెలంగాణ స్థానిక భాషలకు ప్రాధాన్యం
బంజారా, కోయ, గోండి, కొలాం భాషల్లో వాచకాలు
సిటీ బ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ‘అవన్ గార్వేర్ పండగామ బడోమోటో తీజ్ పండుగ(బంజారా)… కుటుంబాతూర్ సందీర్ మీరే మాసి మంజి, వారోన సుఖ్దుఖ్నగా సాత్సీసీ మీరే మాసి మందంతేర్.. మావ సమాజ్ గొండి సమాజ్ అందు.(కోయ).. మాకున్ కోయతూర్ ఇంజెర్ ఇంతేర్ (గోండి). భీమల్ పేన్ మావా నార్ నాటె మందాన్తా.. భీమల్ పేన్ దున్ ఉంది మట్టమ్ మందాన్తా (కొలాం).. ఇదంతా అర్థం కాని భాషలో ఉందంటే పప్పులో కాలేసినట్లే.. గిరిజన జాతులైన బంజారా, కోయ, గోండి, కొలాం జాతులకు సంబంధించి వారు మాట్లాడే భాషలకు చెందినవి ఈ పదాలు. మాతృభాషలో చదువుకుంటే.. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారన్న ఉద్దేశంతో గిరిజన జాతులకు చెందిన చిన్నారులకు తెలుగుతో పాటు తమ జాతులకు ప్రత్యేకమైన భాషల్లోనూ చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1426 గిరిజన పాఠశాలలను నెలకొల్పి గిరిజనుల మాతృభాషలోనే చదువుకునేందుకు 2020-21 విద్యా సంవత్సరానికి గాను వాచకాలను రూపొందించింది. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా పాఠశాలలను ప్రారంభించకపోయినప్పటికీ, డిజిటల్ విధానంలో అందించే బోధన కార్యక్రమాల్లో ఈ భాషలకు సంబంధించిన వాచకాలపై పాఠాలు బోధించారు. కాగా ఈ ఏడాది అనుకూలిస్తే.. విద్యార్థులకు నేరుగా గిరిజన భాషల్లో వాచకాలను బోధించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ ఏడాది పూర్తిస్థాయిలో..
2019-20లో ప్రయోగాత్మకంగా బంజారా, గోండి, కోయ, కొలాం భాషల్లో చిన్న పదాలతో పాఠ్యాంశాలను బోధించారు.. దీని ఆధారంగా ఇతర సబ్జెక్టులతో పాటు 2020-21 సంవత్సరానికి గాను పూర్తిస్థాయిలో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు గిరిజన భాషల్లో వాచకాలను రూపొందించి పుస్తకాలను ముద్రించారు. 2021-22 విద్యా సంవత్సరం (ఈ ఏడాది) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. వినూత్నంగా రూపొందించిన ఈ వాచకాల్లో పదజాలం, చిత్రాలు గిరిజన విద్యార్థులు తమ ఇంట్లో రోజూ ఉపయోగించే అంశాల గూర్చి ఉండటంతో తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. అదే విధంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గూర్చి ఈ వాచకాల్లో పేర్కొనడం ద్వారా వారి సంస్కృతిని కాపాడుకోగలుగుతారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నం వల్ల గిరిజ విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా తమ ప్రాథమిక విద్యను కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. గిరిజన భాషలోని పాఠాలను ఉపాధ్యాయులు తెలుగు భాషలో బోధించేందుకు వీలుగా ప్రతి గిరిజన భాషా వాచకం వెనుక భాగంలో క్లుప్తంగా తెలుగు భాషలో పాఠాలను పొందుపర్చడంతో ఉపాధ్యాయులు వాటిని ఉపయోగించి గిరిజన మాతృభాషల్లో బోధించేందుకు అవకాశం కల్పించారు.