సేల్స్ లేక బోసిపోయిన జ్యువెల్లరీ దుకాణాలు
లాక్డౌన్కుతోడు పెరిగిన బంగారం
ధరే కారణం
రామగిరి/బొడ్రాయిబజార్, మే 14: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి కొవిడ్ కారణంగా లాక్డౌన్ పెట్టడంతో వ్యాపారాలు పెద్దగా సాగలేదు. ఉదయం 10 గంటల వరకు జ్యువెల్లరీ దుకాణాలు తెరిచి ఉంచినా జనం ఇంటికే పరిమితం కావడంతో కొద్దిమేర మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. గతేడాదిలాగానే ఈ సంవత్సరం కూడా అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు నిరుత్సాహంతో ఉన్నారు.
సగానికి పడిపోయిన సేల్స్
అక్షయ తృతీయ రోజున నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు రూ. 50నుంచి 60 లక్షల బంగారం, నగల వ్యాపారం జరిగేదని, ఈ సారి అందులో సగం కూడా జరుగలేదని వ్యాపారులు తెలిపారు. మరో వైపు బంగారం ధర కూడా పెరగడం కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం 10గ్రా బంగారం రూ. 49,750 ఉండడంతో సామాన్యులు కొనలేదని తెలుస్తున్నది. వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండగా ఇప్పటికే చాలా మంది కొని పెట్టుకొని ఉన్నట్లు సమాచారం. అయితే సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయిబజార్, అలంకార్రోడ్లో మాత్రం కొద్దిమేర కొనుగోళ్లు జరిగాయి.
ముందస్తు బంద్తోనే..
నల్లగొండలో ప్రధాన జ్యువెల్లరీ షాపుల యాజమాన్యాలు లాక్డౌన్ కంటే ముందే పది రోజులపాటు స్వచ్ఛందంగా బంద్ చేయాలని నిర్ణయించాయి. దీంతో పట్టణవాసులకు బంగారు ఆభరణాలు అంతగా అందుబాటులో లేవు. ఎవరో సెంటిమెంట్ కోసం వచ్చిన వారితోనే వ్యాపారం సాగింది. గతంకంటే అమ్మకాలు చాలా పడిపోయాయి.