ఆపత్కాలంలోనూ ఆగని ధాన్యం కొనుగోళ్లు
అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్
లక్ష్యానికి చేరువలో కొనుగోళ్లు
మిల్లుల కేటాయింపులో ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కృషి
హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు
ఖమ్మం, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. కేంద్ర సర్కారు కొర్రీలు పెడుతున్నా.. నూతన చట్టాలతో అడ్డుపడుతున్నా.. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కర్షకుల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తున్నది. లాక్డౌన్ విధించినా.. కొనుగోళ్లకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టింది. అంతేకాదు, ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు నేరుగా రైతుల ఖాతాలో సొమ్ము జమ చేస్తుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు లక్ష్యం, దిగుబడి, కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరు, రైతులకు జమైన సొమ్ము తదితర అంశాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
ఒకప్పుడు ధాన్యం రాసులు చూడాలంటే ఎక్కడో పెద్ద రైతుల వద్దకు వెళ్తేనే కనిపించేవి. ఇప్పుడు ప్రతి రైతు పొలంలో ధాన్యం రాసులతో కళకళలాడుతున్నది. గతేడాది యాసంగికి 60 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ సారి యాసంగికి 78,743 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే 151 కొనుగోలు కేంద్రాలు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇందులో 97 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. కల్లాల వద్దే కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఆరబోసుకుని విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 50 శాతం పంట కోతకు రావడంతో విక్రయాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అధికారులు పకడ్బందీగా కొనుగోళ్లు చేపడుతున్నారు.
పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వడంతో పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1,146 మంది రైతులు 25,836 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. అదే విధంగా అధికారులు వారికి రూ.48 కోట్ల సొమ్ము చెల్లించారు.
హమాలీలకు పెరిగిన ఉపాధి..
కొనుగోళ్లు కేంద్రాలు పెంచడంతో ధాన్యం లోడింగ్ చేసే హమాలీలకు ఉపాధి పెరిగింది. జిల్లాలో 151 కేంద్రాల్లో 800 మంది హమాలీలు ఉపాధి పొందుతున్నారు. పౌరసరఫరాల శాఖ గోదాముల్లో మరో 500 మంది హమాలీలు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతి రోజు రూ.700 పైగా హమాలీలకు కూలి దొరుకుతున్నది.
రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయించుకునే అవకాశం లేకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొవిడ్ కాలంలోనూ రైతులకు కొండంత అండగా నిలుస్తున్నది. ఈ సారి యాసంగిలో గతం కంటే జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయగా.. దిగుబడి కూడా అదే స్థాయిలో వచ్చింది.
433 కేంద్రాలు ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 433 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఏప్రిల్ మొదటి వారం ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సాగుతున్నాయి. రైతులకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాకు 1.12 కోటి గన్నీ సంచులు అవసరం కాగా.. ఇప్పటికే 77.16 లక్షల గన్నీ సంచులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 58.18 లక్షల సంచులను వినియోగించారు. ప్రభుత్వం నెల రోజుల్లో రైతులు నుంచి రూ.192 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో రూ.100 కోట్ల 3 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా రూ.92 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించిన వెంటనే వివరాలు నమోదు చేసుకొని ఎంటర్ చేసిన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తారు. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ధాన్యం విక్రయించిన వారంరోజుల్లో నగదు జమ కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కృషి
జిల్లాలో యాసంగి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దృష్టిసారించారు. జిల్లాలో ఈ సారి పంట విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా బాగానే వచ్చింది. దీంతో మంత్రి మిల్లుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మిల్లులకు కేటాయించేలా కృషి చేశారు. ఫలితంగా పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని అనేక రైస్ మిల్లులకు జిల్లా నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే అవకాశం లభించింది. జిల్లాలో 430 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,877 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధర గ్రేడ్-1 రకానికి రూ.1,888, గ్రేడ్-2 రకానికి రూ.1,868లు క్వింటాకు చెల్లిస్తున్నారు.
ఆపత్కాలంలో అండగా..
లాక్డౌన్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచింది. రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఇబ్బంది కలగకూడదని సీఎం కేసీఆర్ ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలు యథావిధిగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, విక్రయించిన ధాన్యానికి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కేసీఆర్ రైతుల పక్షపాతి అని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
50శాతానికి పైగా కొనుగోలు పూర్తి..
ఖమ్మం జిల్లాలో కొనుగోళ్లను మరింత వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 300 కొనుగోలు కేంద్రాల నుంచి 1లక్ష 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. నిర్ణీత లక్ష్యంలో 50 శాతానికి చేరుకున్నాం. కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పలిన్లను అందుబాటులో ఉంచాం. గన్నీ సంచుల కొరత లేకుండా చూస్తున్నాం. ధాన్యాన్ని తరలించేలా అవసరమైన మిల్లులను ప్రభుత్వం కేటాయించింది. ఆయా జిల్లాల్లోని మిల్లులకు ఖమ్మం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని ధాన్యాన్ని తరలిస్తున్నాం.