జనగామ, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ, విజయదశమిని పురస్కరించుకొని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. రెండేళ్లుగా కరోనా దెబ్బకు కుదేలైన వ్యాపారాలు ఈ పండుగలతో మళ్లీ పుంజుకున్నాయి. మరోవైపు బంధువులు, ఆడబిడ్డల రాకతో ఇండ్లలో సందడి వాతావరణం నెలకొంది. నేడు(గురువారం) పెద్ద బతుకమ్మ వేడుకకు మహిళలు సర్వం సిద్ధం చేశారు. కొత్త బట్టలు, పిండివంటలు, కిరాణా సామగ్రి కొనుగోళ్లతో జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. కిరాణం, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హోంనీడ్స్, ఫర్నిచర్ వంటి దుకాణాల్లో సైతం కొనుగోళ్ల సందడి నెలకొన్నది. గతేడా ది కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎవరి ఇళ్లలో వారే నిరాడంబరంగా పండుగ జరుపుకోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు సైతం పడిపోయి వ్యాపారులు నష్టపోయారు. ఇన్నాళ్లు శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలకు దూరమైన ప్రజలు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొవిడ్ నిబంధనలు పాటించి పండుగ వేడుకలు జరుపుకోవాలన్న అధికారుల సూచనలు, హెచ్చరికలను ప్రజలు పట్టించుకోవడంలేదు. నూటికి 30 శాతం మంది ప్రజలు సైతం మాస్కులు ధరించడంలేదు. వందలు, వేల సంఖ్యలో షాపింగ్ మాల్స్లో ఒకేచోట గుమ్మకూడి కొనుగోళ్లు జరుపుతున్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఈసారి జోరుగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. కొత్తకొత్త డిజైన్లలో ఆభరణాలు ధరించేందుకు మహిళలు, యువతులు పోటీపడి దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని బులియన్ మార్కెట్లో సందడి నెలకొన్నది. మునుపెన్నడూ లేనంతగా ఈసారి మహిళలు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ డిజైన్ జాకెట్లు, డ్రెస్సులు ధరించేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈసారి పండుగ సీజన్లో ఒక్క జనగామ జిల్లా కేంద్రంలోనే రూ.7నుంచి రూ.10 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రం సహా పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో సైతం జోరుగా పండుగ వ్యాపారం జరుగుతుండగా మద్యం దుకాణాలు కొనుగోళ్లతో కిక్కిరిసిపోతున్నాయి.
కిరాణం కొనుగోళ్ల సందడి..
పండుగ సందర్భంగా రుచికరమైన పిండివంటలు, మాంసం వంటకాల కోసం ప్రజలు అవసరమైన సరుకులను కొనుగోలు చేస్తుండటంతో కిరాణాదుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన యాదాద్రి, సూర్యాపేట, సిద్ధిపేట, వరంగల్ రూరల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి బట్టలు, సరుకులు, మద్యం కొనుకోళ్ల కోసం జనగామ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా కన్పిస్తున్నాయి. నెహ్రూపార్కు, రైల్వేస్టేషన్, సిద్ధిపేట రోడ్డు, స్వర్ణకళామందిర్, పాతబీట్బజార్, హైదరాబాద్ రోడ్డు, సూర్యాపేట రోడ్డులో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పండుగ సీజన్ వారం, పదిరోజుల్లో రోజుకూ రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల వ్యాపారం జరుగుతున్నది.
రద్దీగా బస్టాండ్, రైల్వేస్టేషన్..
ఆర్టీసీ, రైల్వేస్టేషన్ జనంతో కళకళలాడుతున్నది. రైళ్లలో రోజువారీగా 25 నుంచి 30వేల మంది జిల్లాకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా అయితే రోజుకు 10వేల మంది రాకపోకలు సాగిస్తుండటంతో జనగామ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది.
నేడు సద్దుల బతుకమ్మ పండుగ..
గత బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రా రంభమైన పండుగ తొమ్మిదో రోజు గురువారం సద్దుల బతుకమ్మతో ఆడబిడ్డల పండుగ ముగియనుంది. గత రెండేళ్లుగా కరోనా నిబంధనల నేపథ్యంలో సామూహికంగా కాకుండా ఎవరి ఇళ్లలో వారే బతుకమ్మ జరుపుకున్న మహిళలు..ఈసారి మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వేడుకలకు అధికారులు అనుమతి ఇవ్వడంతో బతుకమ్మ పండుగ సందడి కనిపిస్తున్నది. జిల్లా అంతటా బుధవారం తంగేడు, గునుగు, గడ్డి, చామంతి పూల అమ్మకాలు జోరందుకున్నా యి. రద్దీతో ముఖ్య కూడళ్లు సందడిగా మారా యి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు తమ పుట్టింటికి వస్తారు. నిత్యం తీరొక్క రకాల పూలు సేకరించి కళాత్మకంగా బతుకమ్మను పేరుస్తారు. పసుపు ముద్ద లేదా గుమ్మడిపూల కీలాగ్రాన్ని గౌరవమ్మకు ప్రతిరూపంగా ప్రతిష్టిస్తారు. పేద, ధనికవర్గ, వయోభేదాలు లేకుండా మహిళలంతా సామూహికంగా ఒకేచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్ధ్దంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు.