గద్వాల నియోజకవర్గంలో రూ.106కోట్ల అభివృద్ధి పనులు
ప్రారంభానికి సిద్ధంగా సంగాల చెరువు వద్ద పార్కు, ఆర్వోబీ, వసతి గృహం
నెరవేరుతున్న ఎన్నికల హామీలు
గద్వాల, సెప్టెంబర్13: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండి పోయింది. నియోజకవర్గంలో ఒక్కటి కూడా శాశ్వతమైన పనులు చేపట్టలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్వాల నియోజకవర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది.
గతంలో కేటీఆర్ గద్వాల పర్యటనకు వచ్చిన సమయంలో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు ఇవ్వగా వాటితో గద్వాల మున్సిపాలిటీలో సీసీరోడ్లతో పాటు డ్రైన్లు,పార్కులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలకు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు గద్వాల అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు రూ.వంద కోట్లతో గద్వాల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. మంగళవారం ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వాటికి శంకుస్థాపన, ఇప్పటికే పూర్తైన నిర్మాణాలను ప్రారంభించనున్నారు. 30ఏండ్ల కాలంలో ఒకేసారి రూ.106 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు పెట్టడం తెలంగాణ ప్రభుత్వంలోనే సాధ్యమైంది.
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేసి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వీటితో పాటు ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలైన నర్సింగ్ కళాశాల త్వరలో ప్రారంభమవుతుంది. దీంతో పాటు ఐఐఐటీకి అడుగులు పడ్డాయి. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. గద్వాల నియోజకవర్గం విద్య,వైద్య రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది.
ప్రారంభోత్సవాలు
గద్వాల సమీపంలోని సంగాల చెరువు వద్ద రూ.1.5కోట్లతో పార్కును ఏర్పాటు చేయగా, మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నదిఅగ్రహారం వద్ద పీజీ విద్యార్థులకు రూ.10కోట్లతో నిర్మించిన వసతి గృహాలను మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో, జిల్లా దవాఖాన ఎదుట రూ.25కోట్లతో నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించనున్నారు.
శంకుస్థాపనలు
ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ.15కోట్లతో పార్కుకు శంకుస్థాపన.
గద్వాల మండలం గోన్పహాడ్ వద్ద రూ.30లక్షలతో నిర్మించే షాదీఖానకు శంకుస్థాపన.
జిల్లా కేంద్రంలో రూ.1.6కోట్లతో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమిపూజ.
జిల్లా కేంద్రంలో బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు రూ.1.5కోట్లతో భూమిపూజ.
గద్వాల మున్సిపాలిటీలో సీసీరోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్, కౌన్సిల్ సమావేశ మందిరాలకు రూ.26కోట్లతో భూమిపూజ.
గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.15కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ.
గతంలో ఆగిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.6.25కోట్లతో భూమిపూజ
శిథిలావస్థకు చేరుకున్న ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టడానికి రూ.4కోట్లతో భూమిపూజ.
నదిఅగ్రహారం దగ్గర ఉన్న పీజీ కళాశాలలో విద్యార్థుల కోసం రూ.10కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి కేటీఆర్తో పాటు ఆయా శాఖల మంత్రులు హాజరై శంకుస్థాపనలు చేయనున్నారు.