ఉండవెల్లి, సెప్టెంబర్13: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే పాలమూరు పచ్చపడి రైతన్నలు సుభిక్షంగా జీవిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులకు సోయి లేకే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ముఖ్యమంత్రి దత్తత జిల్లా పాలమూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, ప్రసాద్ స్కీం ద్వార ఆలయాల అభివృద్ధికి రూ.40కోట్లు, ప్రతి గ్రామపంచాయతీకి బీటీరోడ్డు నిర్మాణం, ప్రతి మండలానికి కస్తూర్బా గాంధీ పాఠశాలల, గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు అత్యుత్తమ వైద్యం కోసం రూ.23కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ స్కామ్ల పార్టీ అని, ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన పాలన మీది అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించే ముందు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుందని హెచ్చరించారు.