ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో రోగాలు దూరం
సీజనల్ వ్యాధులపై కారుల విస్తృత అవగాహన
రోడ్లకు ఇరువైపులా మొక్కలతో వెల్లివిరుస్తున్న పచ్చదనం
ఇచ్చోడ, జూన్ 13 :ఉమ్మడి పాలకుల హయాంలో పల్లెలు ప్ర‘గతి’ తప్పాయి. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అరకొర నిధులతో పనులు చేసి చేయనట్లు దర్శనమిచ్చేవి. దీంతో గ్రామాల్లో సమస్యలు రాజ్య మేలాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పల్లెల రూపురేఖలు పూర్తిగా మారాయి. స్వచ్ఛ పల్లెలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీలను ఆదర్శంగా నిలిపేందుకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేయడంతో నిరంతర ‘ప్రగతి’ని కొనసాగిస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు. వానకాలం కావడంతో సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. హరితహారంతో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో మొత్తం 32 గ్రామపంచాయతీలున్నాయి. ఈ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది గ్రామీణులకు అవ గాహన కల్పిస్తున్నారు. పరిసరాల శుభ్రత, దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అధికారులు ప్రతిరోజూ ఒక గ్రామాన్ని సందర్శిస్తు న్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పల్లెలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకొని స్వచ్ఛ పల్లెలుగా మార్చేందుకు ప్రజలు కూడా కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. –
పేదల కష్టాలను తీర్చే మౌలిక వసతులు..
గ్రామీణ ప్రాంతాల్లో గుంట భూమి లేని పేద కుటుంబాల ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాలు చేయడానికి ఆరు అడుగుల జాగ కోసం ఇబ్బందులు తలెత్తేవి. జీవితమంతా కష్టాలతోనే సాగిన పేదలకు చివరి మజిలీకి కష్టా లు తప్పలేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించింది. చివరి మజిలీలో కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో రూ.12 లక్షలతో ఊరికో వైకుంఠధామం నిర్మించింది. చాలా గ్రామాల్లో ఇవి పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల తుది దశలో ఉన్నాయి. సమస్యలు పరిష్కరించుకునేందుకు రైతు వేదిక భవనాలను నిర్మించింది. ఉపాధి హామీ పథకంలో రైతులు ధాన్యం ఆరబెట్ట డానికి కల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గ్రామానికో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. అందులో తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచేందుకు, పనికిరాని వస్తువులను వేరు చేసేందుకు ప్రత్యేక అరలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ జీపీ సిబ్బంది చెత్తను తొలగిస్తుండడంతో గ్రామాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి.
జీపీకో ట్రాక్టర్.. వాటర్ ట్యాంకర్..
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో గ్రామా లను శుభ్రంగా మార్చేందుకు జీపీకో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు వాటి ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామాలను సర్పంచ్లు, పాలక వర్గం సభ్యులు శుభ్రంగా ఉంచుకొనేలా చర్యలు తీసుకుంటు న్నారు. పంచాయతీకి ఒక వాటర్ ట్యాంకర్ కూ డా అందజేశారు. పల్లె వీధుల్లో, రోడ్లకు ఇరువైపు లా నాటిన మొక్కలు, పల్లె ప్రకృతి వనం, హరిత వనంలో నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రతి శుక్రవారం నీటిని అందిస్తున్నారు. హరిత హారం పథకం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరుగుతు న్నాయి. దీంతో గ్రామస్తులు ఉదయం, సాయంత్రం అందులో వాకింగ్, జాగింగ్ చేస్తూనే ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరుతున్నారు.
ఆదర్శంగా నిలుపుతాం..
పల్లెలను స్వచ్ఛతగా మార్చేందుకు చర్య లు తీసుకుంటున్నాం. సీజనల్ వ్యా ధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. దోమల నివారణ కోసం ప్రతి శుక్రవారం డ్రైడే పేరుతో నిల్వ ఉన్న నీరు, నీటి తొట్టిల ను శుభ్రం చేస్తున్నాం. దోమలు లేకుండా, నీరు కలుషితం కాకుండా కృషి చేస్తున్నాం. ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు చేసి, వాటిని డంప్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువుల తయారీ కార్యక్రమం సత్ఫలితా లను ఇస్తున్నది. పల్లెల అభివృద్ధికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇది శుభపరిణామం.