పల్లె ప్రగతి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్న పల్లె
వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల లక్ష్యం పూర్తి
ప్రతి ఇంటికీ ‘మిషన్ భగీరథ’ నీరు
గ్రామానికి ‘హరిత’హారం
ఏన్కూరు, జూన్ 13: ఏన్కూరు మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పల్లె ప్రగతి పనుల్లో దూసుకెళ్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలో అరకొర వసతులతో ఉన్న ఈ గ్రామం తెలంగాణ సర్కార్ విడుదల చేసిన నిధులతో ప్రగతి బాట పట్టింది. గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. పారిశుధ్య నిర్వహణతో వీధులు శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడంతో గ్రామానికి కొత్తకళ వచ్చింది. పాత బావులు, పాడుపడిన ఇండ్లను కూల్చడం, మురికి గుంటల్ని పూడ్చడంతో పల్లె ‘క్లీన్ అండ్ గ్రీన్’గా దర్శనమిస్తున్నది. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు కాంతులు విరజిమ్ముతున్నాయి.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి..
1,481 జనాభా ఉన్న ఈ పంచాయతీలో పాలకవర్గం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. ఎనిమిది మంది పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తున్నారు. కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. వీధుల్లో ప్రతిరోజూ బ్లీచింగ్ చల్లుతున్నారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. దీంతో గ్రామంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. 100శాతం ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది.
మొక్కల పెంపకంతో గ్రామానికి శోభ..
గ్రామంలో ఎకరా స్థలంలో రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పల్లెకు కొత్త కళను తీసుకువచ్చింది. పాలకవర్గం ఏపీలోని కడియం నుంచి మొక్కలు తీసుకువచ్చి నాటించింది. పంచాయతీ సిబ్బంది క్రమం తప్పకుండా మొక్కలకు నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం వనంలో పండ్ల మొక్కలు, పూలు, నీడనిచ్చె 5 వేల మొక్కలు పెరుగుతున్నాయి. సిబ్బంది ట్యాంకర్ ద్వారా ప్రతిరోజు నీరు పెడుతున్నారు. గ్రామంలో రూ.22 లక్షల నిధులతో రైతువేదిక, రూ.18 లక్షలతో సీసీ రోడ్లు, రూ.4 లక్షలతో పంచాయతీ భవనం, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్ అందుబాటులోకి వచ్చాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధజలం అందుతున్నది.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
శ్రీరామగిరి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. గ్రామాభివృద్ధే ధ్యేయంగా సమష్టిగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నాం. పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతున్నది.
-బండ్ల విజయకుమారి, సర్పంచ్, శ్రీరామగిరి